కర్నూల్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన జగన్- సంకల్బాగ్ ఘాట్లో పూజలు
తుంగభద్ర నది పుష్కరాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కర్నూల్లో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న సీఎం జగన్ కేబినెట్ మంత్రులతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు.ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ పుష్కరాలు జరగనున్నాయి.
కర్నూలు సంకల్బాగ్ ఘాట్ వద్ద పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్ అక్కడే స్ధానిక నేతలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఘాట్లో తుంగభద్రా నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించి నదికి హారతిచ్చి పుష్కరుడిని ఆహ్వానించారు.
ఈ ఘాట్లో పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు నిత్య హోమాలు నిర్వహించబోతున్నారు. తుంగభద్ర పుష్కరాల సందర్భఁగా సంకల్బాగ్ ఘాట్తో పాటు మొత్తం 23 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కరోనా కారణంగా పుష్కర స్నానాలకు అనుమతివ్వలేదు. కేవలం నీటిని తలపై జల్లుకునేందుకే అనుమతిచ్చారు. ప్రధాన ఘాట్లలో గంగా హారతి నిర్వహిస్తారు.
Recommended Video
పుష్కరాల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలోని తుంగభద్రానది ప్రవహించే కోడమూరు, కర్నూలు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు గౌరవించి పుష్కరాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.