లంచం ఇవ్వాలి : ధర్మం చేయండి : కలెక్టర్ విచారణ
దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా..అంటూ ఓ బ్యానర్ పట్టుకొని ఒక రైతు చేస్తున్న వినూత్న నిరసన ఇప్పుడు జిల్లా స్థాయి దాటి సచివాలయం వరకు చేరుకుంది. దీని పై కలెక్టర్ నేరుగా నివేదిక సిద్దం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ విషయం ఎందుకింత వివాదం అయింది...
వీఆర్వో కు లంచం ఇవ్వాలి..
ఏపిలోని కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు కొద్ది రోజులుగా ఓ బ్యానర్ చేత బట్టి..కుటుంబ సభ్యులతో కలిసి భిక్షాటన చేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించటానికి అధికారులు లంచం అడుగుతున్నారని..వారికి ఇవ్వటం కోసం దానం చేయాలని వేడుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు. వారిలో వన్యం వెంకటేశ్వర్లు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు రావాల్సిన 25 ఎకరాల భూమిని సమీప బంధువు ఆక్రమించాడని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. తన భూమి తనకు ఇప్పించాలని కోరగా..తమ వీఆర్వో లంచం డిమాండ చేసారని ఆరోపించారు. దీంతో..నాలుగు రోజులుగా వెలుగోడు పట్టణం లో కుటంబ సభ్యులతో కలిసి మెడలో ఓ బ్యానర్ తో బిక్షాటన ప్రారంభించారు.
ఆరోపణలు నిరాధారం..
నాలుగు రోజులుగా బ్యానర్ తో భిక్షాటన చేస్తున్న వెంకటేశ్వర్లు వ్యహారం పై అధికారులు దృష్టి సారించారు. ఒక వైపు విచారణ జరుగుతుండగానే..మరో వైపు వెంకటేశ్వర్లు..తన బ్యానర్ పై దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా అని భిక్షాటన కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోపణల పై ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. వెంకటేశ్వర్లు అలియాస్ రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు. ఇదే అంశాన్ని కలెక్టర్ కు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం కలెక్టర్ ఇదే విషయా న్ని నివేదించారు.