లాక్ డౌన్ లోనూ తెరుచుకుంటున్న గుళ్లు.. వైసీపీ నేతలపై అఖిల ప్రియ ఫైర్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి భయాలతో ప్రభుత్వం అన్ని దేవాలయాల్లోనూ నిత్య దర్శనాలను రద్దు చేసింది. కేవలం అర్చకుల సాయంతో పూజలు, కైంకర్యాలు మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా అధికార వైసీపీ నేతలు తమ పలుకుబడితో గుళ్లలో పూజలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని అహోబిలం నరసింహస్వామి దేవాలయంలో స్ధానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి కాస్తా వివాదాస్పమవుతున్నాయి.
స్వాతీ నక్షత్ర కాలంలో అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి భారీగా భక్తులు దర్శనాలకు వస్తుంటారు. అయితే లాక్ డౌన్ కారణంగా దేవాలయంలో దర్శనాలు రద్దయినా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి గుడిని తెరిపించి పూజలు నిర్వహించడాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తప్పుబట్టారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల డిమాండ్ చేస్తున్నారు.
గత నెలలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. తాజాగా కర్నూలు అహోబిలం దేవాలయంలో వైసీపీ నేతలు పూజలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.