విషాదం: రైలు కిందపడి నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య
కర్నూలు: జిల్లాలోని పాణ్యం మండలం కౌలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి మహిళతో సహా నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో నాలుగు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు.
అయితే, వీరిలో ఒకరిని నంద్యాల సమీపంలోని రాజకుంటకు చెందిన అబ్దుల్ కలాంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్థిక కారణాలతోనే చనిపోయారా? లేదా ఇంకేమైనా కారాణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జనుజ్జయిపోయాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆవేశంలో భార్యను కొట్టి చంపిన భర్త
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రులో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని కోపోక్రోద్రిక్తుడైన భర్త తన భార్యను కర్రతో బలంగా తలపై కొట్టాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యలవర్రుకు చెందిన ఎఫ్రాయమ్మ(90) నవంబర్ ఒకటో తేదీన సామాజిక పింఛను తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఖర్చుల కోసం తనకు రూ. 200 ఇవ్వమని భర్త సామేలు ఆమెను అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సామేలు.. భార్య ఎఫ్రాయమ్మను కర్రతో బలంగా కొట్టాడు.
దెబ్బలకు తట్టుకోలేని ఎఫ్రాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుమారుడు ఏసయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.