విజయారెడ్డి సజీవదహనం ఘటన మరువకముందే .. గూడూరు తహసీల్దార్ లంచావతారం
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం జరిగిన నాటినుండి రెవెన్యూ శాఖపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తహసీల్దార్ విజయ రెడ్డి సజీవదహనం అమానవీయ చర్య అని రెవిన్యూ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.అయితే రెవిన్యూ శాఖ ఉద్యోగులపై ప్రజల నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ విజయారెడ్డి సజీవదహనం ఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగుల నిలదీతలు పర్వం కొనసాగుతోంది.తమను రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు రోడ్లు ఎక్కుతున్నారు. లంచాల కోసం వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి అరెస్ట్: చంచల్గూడ జైలుకు మాజీ తహసీల్దార్ లావణ్య
లంచాలకు అలవాటు పడ్డారని రెవెన్యూ అధికారులపై విమర్శలు
ఇదిలా ఉంటే ఒక పక్క రెవెన్యూ ఉద్యోగులు లంచాలకు అలవాటు పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనూ రెవెన్యూ ఉద్యోగుల తీరు ఏ మాత్రం మారడం లేదు. లంచం ఇస్తే తప్ప ఫైల్ కదిలని పరిస్థితి ప్రభుత్వ ఆఫీసుల్లో నేటికీ కొనసాగుతోంది.ఇక తాజాగా లంచం తీసుకుంటూ ఓ తహసిల్దార్ ఏసీబీకి అడ్డంగా పట్టుబడింది. ఆన్లైన్లో భూరికార్డుల క్లియరెన్స్ కోసం ఓ రైతు నుండి నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా గూడూరు కు సంబంధించిన తహసిల్దార్ హసీనా బి అడ్డంగా దొరికిపోయింది.
లంచం తీసుకుంటూ పట్టుబడిన గూడూరు తహసీల్దార్ హసీనాబీ
గూడూరు ఆన్లైన్లో భూమి క్లియరెన్స్ కోసం ఒక రైతును రూ. 8 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ప్లాన్ ప్రకారం రైతు తహసీల్దార్ కు డబ్బులు ఇస్తుండగా రైతు నుంచి రూ.4 లక్షలు తీసుకుంటున్న ఈ క్రమంలో తహసిల్దార్ హసీనాబీ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒకపక్కన తెలుగు రాష్ట్రాల ప్రజలు రెవెన్యూ అధికారుల అవినీతి తట్టుకోలేక పోతున్నామని అసహనం వ్యక్తం చేస్తూ, రోడ్ల మీదకు వస్తున్నా లంచాలకు అలవాటుపడిన అధికారుల తీరు మాత్రం మారకపోవడం గమనార్హం.
ఏం జరిగినా మారని రెవెన్యూ అధికారుల తీరు
రెవెన్యూ అధికారుల తీరుతో అసహనం చెంది పలువురు దాడులకు పాల్పడుతున్నా, రెవిన్యూ అధికారులు మాత్రం పైసలిస్తేనే పని చేస్తామని చెప్పడం, చేతులు తడిపితేనే పని జరుగుతుంది అని చెప్పడం రెవిన్యూ శాఖ పనితీరుకు అద్దం పడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ ఆఫీసుల్లో పనులు కాక పలువురు రెవెన్యూ ఉద్యోగుల అవినీతి బాగోతాలను బయట పెడుతున్నారు. బాహాటంగా నిలదీస్తున్నారు. రెవెన్యూ శాఖ పరువంతా తీస్తున్నారు.
ప్రక్షాళన చెయ్యకుంటే ఇబ్బందికర పరిస్థితులు
అవినీతిమయంగా తయారైన రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయకుంటే పరిస్థితులు మరింత దారుణంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఇప్పటికే సహనం నశించిన ప్రజలు చాలా చోట్ల విజయారెడ్డి మృతి తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఈ పరిస్థితులకు చరమగీతం పాడకుంటే, రెవెన్యూ ఆఫీసుల్లో పేరుకుపోయిన లంచాల వ్యవస్థను అరికట్టకుంటే ప్రజలు తిరుగుబాటు చేసేలా ఉన్నారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెవెన్యూ శాఖలో ఉన్న అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.