పాపం, విద్యార్థినిని చంపేశారుగా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి వైద్యమంటూ..!
కర్నూలు : వైద్యో నారాయణో హరి ఏమో గానీ వైద్యో ప్రాణహరి అన్నట్లుగా తయారవుతోంది నేటి పరిస్థితి. దేవుడి తర్వాత దేవుడిలాగా భావించే డాక్టర్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అదే క్రమంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఓ విద్యార్థిని వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
జుట్టు రాలుతోందని డాక్టర్ను సంప్రదిస్తే..!
ఎమ్మిగనూరులోని హరిజన వాడకు చెందిన కదిరికోట నర్సయ్య - రామేశ్వరి దంపతుల కూతురు 19 సంవత్సరాల మౌనిక స్థానిక గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇటీవల జుట్టు బాగా రాలుతుండటంతో శివ సర్కిల్లోని పల్లవి పాలీ క్లినిక్ సిబ్బందిని సంప్రదించారు. అయితే కర్నూలుకు చెందిన డాక్టర్ శరత్ చంద్ర విజిట్ డాక్టర్గా సేవలందిస్తున్నారు. ఆ క్రమంలో రెండు నెలల కిందట ఆయన ఎమ్మిగనూరులోని పల్లవి పాలీ క్లినిక్లో మౌనికను పరీక్షించారు.
వీడియో : రాయలసీమను రతనాల సీమ చేస్తాం.. గోదావరి జలాలు ఏపీకి అందిస్తాం : కేసీఆర్
డాక్టర్ రాసిచ్చిన మందులు వాడి.. శరీరంపై బొబ్బలు రావడంతో..!
తల జుట్టు వీపరీతంగా రాలుతుండటంతో వెంట్రుకలు బాగా పెరగడానికి కొన్ని మందులు రాసిచ్చారు. ఆ క్రమంలో ఆ క్లినిక్కు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులో సదరు మెడిసిన్స్ కొనుగోలు చేశారు మౌనిక. అయితే ఆ మందులు వాడే క్రమంలో శరీరంపై బొబ్బలు రావడం మొదలైంది. దాంతో కంగారుపడ్డ మౌనిక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆమె తల్లిదండ్రులు మళ్లీ డాక్టర్ను కలిసి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించారు. కానీ పల్లవి పాలీ క్లినిక్ సిబ్బందితో పాటు మెడికల్ షాపు నిర్వాహకులు లైట్గా తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోసారి డాక్టర్ను కలవాలని ప్రయత్నం.. సిబ్బంది నిర్లక్ష్యం
డాక్టర్ను పిలిపించాలని.. తమ కూతురును మరోసారి ఆయనకు చూపించాలని వారిని ఎంతగా బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇది చిన్న సమస్యే అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారట అక్కడి సిబ్బంది. తొందరపడొద్దని, తగ్గిపోతుందంటూ చెబుతూ కాలాయాపన చేశారని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల నుంచి వారి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఆ క్రమంలో ఆదివారం నాడు రాత్రి మౌనిక ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.
తెలంగాణలో హిందుత్వ పోటీయా.. బీజేపీని క్రాస్ చేసేందుకు కేసీఆర్ వ్యూహామా?
కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం.. మెడికల్ షాపుకు తాళం
దాంతో కుటుంబ సభ్యుల కోపం కట్టలు తెంచుకుంది. సోమవారం నాడు మెడికల్ షాప్ దగ్గర ఆందోళన చేపట్టారు. సదరు మెడిసిన్స్ ఇచ్చిన మెడికల్ షాపు నిర్వాహకులను నిలదీయడమే గాకుండా ఆ దుకాణానికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురు ప్రాణాలను పొట్టనబెట్టుకున్న డాక్టర్పైనా, మెడికల్ షాప్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.