సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ మెరుపువేగం: సుగాలి ప్రీతి విషయంలో జాప్యం: కర్నూలు ఎస్పీ క్లారిటీ
కర్నూలు: సంచలనం సృష్టించిన కర్నూలు విద్యార్థిని సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు ఉదంతం.. రెండు రోజులుగా రాష్ట్రంలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును సీబీఐ అధికారులు ఇంకా స్వాధీనం చేసుకోకపోవడం వెనుక కుట్ర దాగి ఉందంటూ ఆరోపణలను గుప్పిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇస్తోందంటూ మండిపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తరువాత..ఈ తరహా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాప్యం చోటు చేసుకోవడంపై అనుమానాలు..
ప్రభుత్వం ఉద్దేశపూరకంగానే జాప్యం చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు స్పందించారు. క్లారిటీ ఇచ్చారు. సీబీఐకి అందజేసిన వివరాల ప్రక్రియతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తన ట్విట్టర్ వేదికగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. సుగాలి ప్రీతి కేసును తాము సీబీఐకి అప్పగించామని తెలిపారు. ఈ కేసు వివరాలు తమకు అందినట్లు సీబీఐ ఎస్పీ నుంచి తనకు సమాధానం కూడా వచ్చిందని చెప్పారు.
సీబీఐ పరిధిలో సుగాలి ప్రీతి కేసు..
ప్రస్తుతం ఈ కేసు సీబీఐ పరిధిలో ఉందని, దర్యాప్తు ఎప్పుడు చేపడతారనే విషయాన్ని తాము నిర్ధారించలేమని అన్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి బదలాయించే ప్రక్రియను తాము జూన్లోనే పూర్తి చేశామని ఫక్కీరప్ప స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తు చేపట్టడం మాత్రమే మిగిలి ఉందని ఆయన వివరణ ఇచ్చారు. జూన్ 11వ తేదీన సీబీఐ ఎస్పీ నుంచి హోం శాఖకు లేఖ రాశారని, అదే నెల 27వ తేదీన తాను సీబీఐ కార్యాలయానికి ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను అందించానని ఫకీరప్ప పేర్కొన్నారు. జులై 6వ తేదీన ఈ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు బదిలీ అయిందని చెప్పారు.
జులై 17 నాటికి పూర్తి వివరాలతో..
ఈ కేసును సీబీఐ ఎస్పీకి అందజేయాలంటూ అధికారికంగా హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయని అన్నారు. సుగాలి ప్రీతి కేసునకు సంబంధించి.. అప్పటి దాకా చేపట్టిన దర్యాప్తు, ఇతర వివరాలతో కూడిన సీడీ, నివేదికను విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ కార్యాలయానికి అందజేయాలంటూ జులై 13వ తేదీన తనతో పాటు ఇంటెలిజెన్స్ అధికారికి ఆదేశాలు అందాయని తెలిపారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా అదే నెల 17వ తేదీన తాను ఈ కేసు పూర్తి వివరాలను విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ కార్యాలయానికి అందజేశానని వివరించారు.
సుశాంత్ సింగ్ కేసులో
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైప్రొఫైల్ సూసైడ్ కేసు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతంపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువడిన మరుసటి రోజే సీబీఐ రంగ ప్రవేశం చేసింది. దర్యాప్తును వేగవంతం చేసింది. దీనితో సుగాలి ప్రీతి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీబీఐకి అప్పగించినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇంకా ఎందుకు జాప్యం జరుగుతోందంటూ సుగాలి ప్రీతి తల్లి నిలదీస్తున్నారు. తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ మేరకు సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదలాయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో కూడా విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ మొత్తం సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ జీవో వెలువడి ఆరునెలల అవుతున్నప్పటికీ.. సీబీఐ ఇంకా దర్యాప్తు చేపట్టకపోవడం పట్ల సుగాలి ప్రీతి తల్లి సహా ఆమెకు ముందు నుంచీ అండగా ఉంటూ వస్తోన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనితో కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.