కర్నూలు జిల్లాలో వరద బీభత్సం ..ముగ్గురు గల్లంతు .. వరదలో మహానంది ఆలయం
కర్నూలు జిల్లాను వరద ముంచెత్తుతోంది. నంద్యాల రెవెన్యూ డివిజన్ నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, గోస్పాడు, కోవెలకుంట్ల తదితర మండలాలలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. పంటలు నీట మునగడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.
జగన్ కు షాక్ .. తండ్రి మరణంతో కోడెల కుమార్తె సంచలన నిర్ణయం
కర్నూలు జిల్లాను ముంచెత్తుతున్న వరదలు .. సహాయక చర్యల్లో అధికారులు
కర్నూలు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లా మహానంది మండలం తమడ పల్లె, నంది పల్లె, సూర్యనంది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహానంది, సంజామాల, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇక వరకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి పంటనష్టాన్ని లెక్కించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. వరద ప్రభావిత ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కడపలోనూ వరద .. ప్రొద్దుటూరు వాగులో ముగ్గురు గల్లంతు .. గాలింపు
ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా కడప జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కడప జిల్లాలో కుందూ, పెన్నా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రొద్దుటూరు వాగులో ప్రవాహానికి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాలలోని పలు కాలనీలు నీటమునిగాయి. సరస్వతి నగర్, ఎన్జీవో కాలనీ, సాయిబాబా నగర్ ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న 39 కుటుంబాలను తాడు సాయంతో ఫైర్ సిబ్బంది రక్షించారు.
జల దిగ్బంధంలో మహానంది ఆలయం .. దర్శనాలు బంద్
గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాల ధాటికి మహానంది ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోనికి నీరు వచ్చి చేరడంతో పంచలింగాల మండపం, కోనేరు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఆలయంలో భక్తులకు దర్శనాలను సైతం నిలిపివేశారు అంతేకాకుండా విపరీతంగా కురుస్తున్న వర్షాలకు మహానంది పరిసర ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతూ , వరద బాధితులకు పునరావాసం కల్పిస్తున్నారు .