భర్త నిజ స్వరూపం... సెల్ఫీ పేరుతో నమ్మించి మర్డర్ స్కెచ్... కర్నూలులో షాకింగ్ ఘటన
ఆమె ఓ అనాథ... అయినా సరే సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. కొన్నేళ్ల క్రితం పరిచయమైన ఓ హోంగార్డు ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. కొంతకాలం కాపురం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాతే అతని అసలు స్వరూపం బయటపడింది. ఇటీవల ఓరోజు బంధువుల ఇంటికి వెళ్దామని భార్యను వెంట తీసుకెళ్లిన అతను.... మార్గమధ్యలో ఓ నదిలో తోసేశాడు. అనాథ కావడంతో అడిగే దిక్కెవరూ లేరని ఆమెను చంపేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ప్రాణాలతో బయటపడటంతో అతని నిజ స్వరూపం బట్టబయలైంది.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. హైదరాబాద్లో హోంగార్డుగా పనిచేసే పత్తి భాస్కర్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి 2016లో పెళ్లితో ఇద్దరు ఒక్కటయ్యారు. కొన్నాళ్ల పాటు భార్యను బాగానే చూసుకున్న భాస్కర్లో కొంతకాలంగా మార్పు వచ్చింది. ఆమెను వదిలించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
సెల్ఫీ పేరుతో... నదిలో తోసేసి...
ఇదే క్రమంలో ఈ నెల 16న కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం మర్రిపల్లెకు భార్య రామలక్ష్మిని తీసుకుని వచ్చాడు భాస్కర్. సోమవారం(సెప్టెంబర్ 20) ఉదయం బంధువుల ఇంటికి వెళ్దామని బైక్పై రామలక్ష్మిని ఎక్కించుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో కుందూ నది వంతెన వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ బైక్ ఆపాడు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకుందామని భార్యను నమ్మించి పక్కనే ఉన్న నదిలోకి తోసేశాడు.
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం...
నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రామలక్ష్మి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తాను కూడా బైక్తో సహా నదిలో దూకాడు. అయితే తనకు ఈత రావడంతో ఎలాగోలా ఒడ్డుకు చేరాడు. రామలక్ష్మి చనిపోయి ఉంటుందని ఇక అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కానీ రామలక్ష్మి ప్రాణాలతో బయటపడటంతో అతను షాక్ తిన్నాడు. నదిలో కొట్టుకుపోతున్న రామలక్ష్మిని స్థానిక రైతులు కొందరు గమనించి రక్షించారు.
Recommended Video
కేసు నమోదు...
అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలు రామలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు భాస్కర్పై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని... బాధితురాలికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.