కూతుళ్లపై తండ్రుల అఘాయిత్యం.. సభ్యసమాజం సిగ్గుపడేలా..
చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ప్రమాదకర దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉందనడానికి రోజుకో రుజువు దొరుకుతోంది. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. కనీసం ఇంట్లోనైనా సేఫ్టీ ఉందనుకోడానికి వీల్లేకుండా ముక్కుపచ్చలారని బాలికలపై తండ్రులే అత్యాచారాలకు తెగబడుతున్నారు. కొత్త సంవత్సం మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.
కన్నకూతురిపై
కన్నకూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన తండ్రిపై కర్నూలు పోలీసులు పోక్సో చట్టం మంగళవారం కింద కేసు నమోదు చేశారు. కుటుంబ బాధ్యతలు మర్చిపోయి ఆ తండ్రి తాగుడుకు బానిసకావడంతో.. తల్లి కూలీ పనులు చేస్తూ పిల్లలిద్దరినీ సాకుతోంది. కూతురితో తండ్రి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన తల్లి.. ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేక కుమిలిపోయేది. గత నెల రెండోవారంలో ఓ రోజు తల్లి పనికి వెళ్లినప్పుడు పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు. బాగా తాగొచ్చిన తండ్రి.. కొడుక్కి సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని బయటికి పంపేశాడు. ఆ తర్వాత కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు.
ఆ తర్వాత స్కూల్ కి వెళ్లిమరీ..
కూతురిపై అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా ఆమె చదువుకునే స్కూల్ కు వెళ్లిమరీ బెదిరించేవాడు తండ్రి. విషయాన్ని తల్లికి చెబితే అందర్నీ చంపేస్తానని బెదిరించేవాడు. ఈక్రమంలో ఓ రోజు అమ్మాయికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తెలిసినవాళ్ల సాయంతో ఆ తల్లి.. కూతుర్ని తీసుకుని నేరుగా పోలీసుల దగ్గరకెళ్లి భర్తపై కేసు పెట్టింది. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు.
నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న..
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న మరో దారుణమిది. జిల్లాలోని మహాముత్తారం మండలం కోనంపేటలో నాలుగేళ్ల చిన్నారిపై సొంత పెద్దనాన్నే లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం.. తల్లితో పక్కలో నుంచి పాపను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. తిరిగొచ్చేక్రమంలో క్రమంలో అలికిడికావడంతో పాపను అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.