Anil Kumar Yadav: మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నిరసనల సెగ: కాన్వాయ్ కు అడ్డు పడి మరీ.. !
Recommended Video
కర్నూలు: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ కు ఒకేసారి రెండుసార్లు నిరసనలను ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఘటనలు చోటు చేసుకున్నారు. తొలుత- శ్రీశైలం రిజర్వాయర్ ముంపు వాసులు, అనంతరం న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు తమ నిరసనలను తెలియజేశారు. తమకు ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ శ్రీశైలం ముంపు వాసులు, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల జేఏసీ నాయకులు ఆయనకు వినతిపత్రాలను అందజేశారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర అసహనంతో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు: రీజన్ ఇదే
తొలిసారిగా కర్నూలుకు..
జిల్లా మంత్రిగా నియమితులైన తరువాత అనిల్ కుమార్ యాదవ్ తొలిసారిగా కర్నూలు పర్యటనకు వెళ్లారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసినందు వల్ల ఆయన తొలుత జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వెళ్లారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయననను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. శ్రీశైలం రిజర్వాయర్ కు ఈ ఏడాది వర్షాకాలం సీజన్ లో ఏడుసార్లు భారీగా వరద వచ్చిన నేపథ్యంలో.. ప్రాజెక్టు భద్రత, ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పటిష్టత, సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కర్నూలుకు వెళ్తుండగా..
శ్రీశైలం నుంచి కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో ఆయన కాన్వాయ్ నందికొట్కూరు సమీపానికి చేరుకున్న వెంటనే.. శ్రీశైలం ముంపువాసులు అడ్డుపడ్డారు. కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ముంపువాసులు పెద్ద సంఖ్యలో నిరసనలు చేస్తుండటాన్ని గమనించిన అనిల్ కుమార్ యాదవ్ కారు దిగి వారితో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తమకు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వాలు విస్మరించాయని, వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా తాము నిరాహార దీక్షలను చేస్తున్నప్పటికీ.. ఎవ్వరూ పట్టించుకోవట్లేదని అన్నారు. వినతిపత్రాలను అందజేశారు. ఈ సమస్యను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు.
కలెక్టర్ కార్యాలయంలో అదే పరిస్థితి..
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మంత్రికి అదే పరిస్థితి ఎదురైంది. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. మంత్రిని చేరుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడుతుందని చెప్పారు.