Pawan Kalyan: కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జనసేన వ్యతిరేకమా? పవన్ వ్యాఖ్యలకు అర్థమేంటీ?
కర్నూలు: తెలిసి చేశారో.. తెలియకుండా చేశారో తెలియట్లేదు గానీ- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాయలసీమ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేలా చేశాయి. ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఎంత మాత్రమూ చేయాల్సిన వ్యాఖ్యలు కావు అవి. 51 అసెంబ్లీ స్థానలు ఉన్న రాయలసీమ జిల్లాల్లో జనసేన పార్టీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఓ అత్యంత కీలకమైన, సున్నితమైన అంశం పట్ల తన వైఖరేమిటనేది స్పష్టం చేసినట్టయిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే- కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.
జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; 'అప్పుడే గొంతు ఎత్తాలి’ అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్
వ్యూహాత్మక తప్పిందమేనా?
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో నిరసన ప్రదర్శనలు చేస్తోన్న రాయలసీమ ప్రజల మనోభావాలను కించపరిచేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి, పులివెందులను రాజధానిగా మార్చుకుంటే ఖర్చులు మిగిలిపోతాయంటూ ఎద్దేవా చేయడం పవన్ కల్యాణ్ వ్యూహాత్మక తప్పిదంగా అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను పవన్ కల్యాణ్ కించపరిచేలా వ్యాఖ్యానించారని అంటున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు డిమాండ్ పట్ల..
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో సీమ జిల్లాలకు చెందిన న్యాయవాదులు చాలాకాలంగా ఉద్యమిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు. విధులను సైతం బహిష్కరించి, రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. ఇప్పటికీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే వస్తున్నాయి. తెలంగాణ రహిత ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండేది. తెలంగాణ విలీనం తరువాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కు తరలించినప్పటి నుంచీ కొన్ని డిమాండ్లు కొనసాగుతూనే వస్తున్నాయి. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడం, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్లకు దశాబ్దాల చరిత్ర ఉంది.
రాజధానిని కోల్పోయిన సీమకు హైకోర్టు కోసం..
రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. రాష్ట్ర రాజధానిని కోల్పోయిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం హైకోర్టునైనా కేటాయించాలంటూ నాలుగు జిల్లాలకు చెందిన న్యాయవాదులు, పౌర సంఘాలు తరచూ ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాన్ని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఇటీవలే నంద్యాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
విస్పష్ట ప్రకటన చేయాలంటోన్న క్యాడర్..
ఈ పరిస్థితుల్లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయాన్ని పవన్ కల్యాణ్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కేసుల వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్ ను విమర్శించే క్రమంలో పవన్ కల్యాణ్.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి, పులివెందులను రాజధానిగా మార్చుకుంటే.. దారి ఖర్చులు తగ్గుతాయంటూ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై రాయలసీమ వాసుల్లో వ్యతిరేకత ఎదురవుతోందని అంటున్నారు జనసేన పార్టీ నాయకులు. దీనిపై పవన్ కల్యాణ్ ఓ స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.