పుష్కరాలకు కర్నూలు ముస్తాబు: భారీ బందోబస్తు: ఘాట్ల వివరాలివే: స్పెషల్ బస్సులు
కర్నూలు: పవిత్ర తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికోసం ఆయన శుక్రవారం మధ్యాహ్నం కర్నూలుకు రానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లను నిర్వహించారు. కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లను చేపట్టారు.
Recommended Video
కర్నూలు ముస్తాబు..
తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని కర్నూలు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన మార్గాల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. పవిత్ర స్నానాలను ఆచరించడానికి వచ్చే భక్తులు గందరగోళానికి గురి కాకుండా ఉండేలా బ్యానర్లను అమర్చారు. ఏ ఘాట్కు ఎటు వెళ్లాలనే విషయాలను ముద్రించిన బ్యానర్లు, బోర్డులను అమర్చారు. ఈ 12 రోజుల్లో కర్నూలులో సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఘాట్ల వద్ద స్ప్రింకర్లు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందు వల్ల నదిలో స్నానం చేయడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. పుష్కర స్నానాన్ని ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం ఘాట్ల వద్ద స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు. వాటి కిందే భక్తులు స్నానం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది గుమికూడటంపైనా నిషేధం ఉంది. భౌతికదూరాన్ని పాటించేలా ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. మాస్కులను ధరించడం తప్పని సరి చేశారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధింత ఇబ్బందులు ఉన్నవారు పుష్కరాలకు రావొద్దని విజ్ఙప్తి చేశారు.
భారీగా బందోబస్తు మధ్య..
తుంగభద్ర పుష్కరాలకు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అయిదువేల మంది పోలీసులను మోహరింపజేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించామని చెప్పారు. ముగ్గురు అడిషినల్ ఎస్పీలతో పాటు డీఎస్పీ-14, సీఐ-46, ఎస్ఐ-99, ఏఎస్ఐ-413, కానిస్టేబుళ్లు-927, మహిళా పోలీసులు-84లను మోహరింపజేశారు. వారితో పాటు స్పెషల్ పార్టీకి చెందిన తొమ్మిది టీమ్లను కర్నూలుకు రప్పించారు. రెండు ఆర్మ్డ్ రిజర్వ్డ్, నాలుగు ఏపీఎస్పీ ప్లటూన్లు, 24 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పరీవాహక ప్రాంతాల్లో 23 పుష్కర ఘాట్లు..
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం పొడవునా 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కర్నూలు సిటీ పరిధిలో మాసా మసీద్ ( పంప్ హౌస్), సంకల్బాగ్, నాగసాయి ఆలయం, రాంభొట్ల ఆలయం, రాఘవేంద్ర మఠం, సాయిబాబా ఆలయం, నగరేశ్వర స్వామి ఆలయంల వద్ద పుష్కర ఘాట్లను నిర్మించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గుండ్రేవుల, సుంకేశుల, పంచలింగాల, మునగాలపాడు, గొందిపర్ల వద్ద ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. సంకల్బాగ్ ఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ ఈ పుష్కరాలను ప్రారంభించనున్నారు.
మంత్రాలయం పరిధిలో
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో రెండు పుష్కర ఘాట్లను నిర్మించారు. ఎన్ఏపీ పంప్ హౌస్, సంత మార్కెట్, వినాయక ఆలయం వద్ద ఘాట్లు అందుబాటులో తెచ్చారు. రాంపురం, మైలిగన్నూర్, కౌతాళం, కాచపురంలల్లో ఘాట్లు నిర్మించారు. ఎమ్మిగనూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాగులదిన్నె రైల్వే బ్రిడ్జి, నాగులదిన్నె విలేజ్, గురుజాలల్లో ఘాట్లు ఉన్నాయి. నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి-సంగమేశ్వరం వద్ద ఘాట్ను నిర్మించింది. ఇదే చివరి ఘాట్. అన్ని ఘాట్ల వద్దకు భక్తులను తరలించడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు.