కర్నూలు స్థానిక పోరు: బైరెడ్డి చొరవతో ఎమ్మెల్యే ఆర్థర్ ప్రత్యర్ధి వైసీపీలో చేరిక
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలసలతో సతమతమవుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల తరహాలో సత్తా చాటి టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకం చెయ్యాలని భావించారు. అందుకోసం ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల నేపధ్యంలో వలసలు ప్రతిపక్ష పార్టీల మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. వారి బలాన్ని నిర్వీర్యం చేసి మైండ్ గేమ్ ఆడుతున్న సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వలసలను ప్రోత్సహిస్తున్నారు .
వైసీపీలో చేరిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ వలసలకు తెరలేపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీని ఎన్నికల సమయంలో దెబ్బ కొట్టే పనిలో ఉంది. అదే సమయంలో సొంత పార్టీలో కూడా కొందరు నేతలకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఇక టీడీపీలో ఒక అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేసి మైండ్ గేమ్ ఆడుతుంది. దీంతో, తెలుగు దేశం పార్టీ నుంచి క్రమంగా వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో కూడా టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ కర్నూల్ జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీలో చేరారు.
ఆర్ధర్ కు రాజకీయ ప్రత్యర్థి అయిన ఐజయ్య చేరిక
ఇక మరోపక్క స్థానిక ఎన్నికల కసరత్తు చేస్తున్న వైసీపీ నేతలు అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తూనే ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు. వైసీపీ రాయలసీమ రీజినల్ కో ఆర్టినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి. అనిల్కుమార్ యాదవ్, నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సమక్షంలో ఐజయ్య వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఐజయ్య తోపాటు టీడీపీకి చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆర్ధర్ కు రాజకీయ ప్రత్యర్థి అయిన ఐజయ్య చేరికతో నందికొట్కూరు రాజకీయం రసకందాయంలో పడింది.
చక్రం తిప్పిన బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి .. ఎమ్మెల్యే ఆర్థర్ ఏమంటారో ?
ఇక ఐజయ్య 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి పోటీ చేశారు. కానీ ఆయన 30 వేలకు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆర్ధర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక అప్పటినుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిని ఒప్పించి ఆ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఇక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గంగా ఐజయ్య పార్టీలో కొనసాగనున్నారని తెలుస్తుంది. ఇక ఐజయ్య చేరికపై ఎమ్మెల్యే ఆర్థర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి .