వామ్మో అవినీతి తిమింగలం.. 10 కోట్లకు పైగా ఆర్టీవో ఆస్తులు..!
కర్నూలు : ఏసీబీ అధికారులకు చిక్కిన ఓ అధికారి లీలలు చూస్తే.. వామ్మో అవినీతి తిమింగలం అనుకోవాల్సిందే. 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టిన సదరు అధికారి గుట్టు చివరకు రట్టైంది. కర్నూలు జిల్లాకు చెందిన ఆర్టీవో అధికారి బాగోతం బయట పడటంతో ఈ అంశం ఏపీలో చర్చానీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివ ప్రసాద్ అవినీతి బాగోతం బయట పడింది. ఏసీబీ అధికారుల సోదాలతో ఈ అవినీతి తిమింగలం గుట్టు రట్టైంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఐదు చోట్లో సోదాలు నిర్వహించారు. శివ ప్రసాద్ ఇల్లుతో పాటు అతని బంధవుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు.
తెలంగాణ కొత్త లిక్కర్ పాలసీ.. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు డబుల్
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆర్టీవో అధికారి శివ ప్రసాద్పై గురి పెట్టారు ఏసీబీ అధికారులు. ఆ మేరకు హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన ఆస్తులు శివ ప్రసాద్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. సోదాలు పూర్తయ్యే సరికి ఇంకెన్నీ ఆస్తులు వెలుగు చూస్తాయో అంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.
రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శివ ప్రసాద్ అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆయన బినామీగా గాజుల రామారావు పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆ మేరకు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు లక్షన్నర రూపాయల నగదుతో పాటు పలు రకాల బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేశారు.