లోకసభ ఎన్నికలు 2019 : కర్నూలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
రాయలసీమలో కర్నూలు నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాక ఆంధ్రదేశంకు తొలి రాజధాని కర్నూలు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్రదేశ రాజధానిగా విరాజిల్లింది కర్నూలు. ఈ నగరం హంద్రీ నది తుంగభద్ర నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. హైదరాబాదు నుంచి కడప, చిత్తూరు, అనంతపురం చేరడానికి కర్నూలు గుండా ప్రయాణించాల్సి రావడంతో దీన్ని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు.
చారిత్రక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో, ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా మారింది. కర్నూలు పేరు వినగానే ప్రతిఒక్కరికీ గుర్తు వచ్చేది కొండారెడ్డి బురుజు. దీన్ని కర్నూలు కోట అని కూడా సంబోధిస్తారు. విజయనగర రాజు అచ్యుత దేవరాయులు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కొండా రెడ్డి బురుజు నగరం నడి బొడ్డున ఉంది. ఇక ప్రసిద్ధిగాంచిన రాఘవేంద్ర స్వామి ఆలయం ఈ జిల్లాకు చెందిన మంత్రాలయంలో ఉంది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం ఉన్న శ్రీశైలం కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో కర్నూలు పార్లమెంటు స్థానం ఒకటి. దీనికింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. తొలిసారి కర్నూలు పార్లమెంటుకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజాసోషలిస్టు పార్టీకి చెందిన గదిలింగన గౌడ గెలుపొందారు. ఈ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 12 సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండుసార్లు, వైసీపీ అభ్యర్థి ఒకసారి గెలుపొందారు.
మొత్తానికి కర్నూలులో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఎక్కువ సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. మొత్తంగా ఏడు సార్లు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కర్నూలు ఎంపీగా గెలుపొందారు. రెండు సార్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. ఇక తెలుగు దేశం నుంచి 1984లో అయ్యపు రెడ్డి విజయం సాధించగా 1999లో కేఈ కృష్ణమూర్తి విజయం సాధించారు. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచారు. అనంతరం ఆమె టీడీపీ కండువా కప్పుకున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా కొనసాగింది. వైసీపీ, టీడీపీల మధ్యనే పోటీ కొనసాగింది. ఆ సమయంలో కర్నూలు పార్లమెంటు పరధిలో 14,81,807 మంది ఓట్లరు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7లక్షల87వేల 91 మంది ఉన్నారు. మహిళ ఓటర్లు 7,43,016 మంది ఉన్నారు. ఇందులో వైసీపీ నుంచి పోటీ చేసిన బుట్టా రేణుకకు 4,72,782 ఓట్లు రాగా టీడీపీ నుంచి పోటీ చేసిన బీటీ నాయుడుకు 4,28,651 ఓట్లు వచ్చాయి. దీంతో 44,131 ఓట్ల తేడాతో బుట్టా రేణుక గెలుపొందారు. ఇక రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఆసక్తికరంగా మారనుంది. వైసీపీ నుంచి టీడీపీకి బుట్టా రేణుకా జంప్ చేయడంతో టీడీపీ నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందా అనే కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో టీజీ వెంకటేష్ కర్నూలు టికెట్ ఆశిస్తున్నారు.
ఇక కర్నూలు ఎంపీగా పనిచేసిన బుట్టా రేణుక తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఖర్చుచేశారో ఒకసారి చూస్తే... ఎంపీలాడ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ. 20 కోట్లు. ఇందులో ఆమె నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసినది రూ. 17.16 కోట్లు. అయితే కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చనే మాట అక్కడి స్థానికులు వినిపిస్తున్నారు.