బాంబుల్లా పేలిన బీరు సీసాలు.. లారీ లోడ్ అగ్నికి ఆహుతి..!
కర్నూలు : హాట్ సమ్మర్లో కూల్ బీర్లు తెగ అమ్ముడుపోతాయి. ఎండ వేడిమి భరించలేక చాలామంది చల్లచల్లగా బీర్లు లాగించేస్తుంటారు. అలా ఎండాకాలంలో బీర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక అసలు విషయానికొస్తే.. బార్లకు చేరాల్సిన లోడ్ లారీ బీర్లు అగ్నికి ఆహుతి కావడం చర్చానీయాంశమైంది.
బీరు లోడ్తో వెళుతున్న లారీ కర్నూలు జిల్లాలో దగ్ధమైంది. లోడ్ దించడానికి వెళుతున్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో లారీలో ఉన్న బీరు సీసాలు బాంబుల్లా పేలినట్లు తెలుస్తోంది. డ్రైవర్కు తీవ్రగాయాలైనట్లు సమాచారం.
గల్ఫ్ బాధితులకు మోక్షం.. ఇండియా రావడానికి లైన్ క్లియర్.. హైదరాబాద్ దౌత్యవేత్త చొరవ
రహదారిపై ఒక్కసారిగా సీసాలు పేలుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాంతో రోడ్డు వెంబడి పరుగులు తీశారు. లారీ దగ్ధం కావడం, అందులోంచి సీసాలు ఎగిరిపడటంతో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వైద్య చికిత్స నిమిత్తం డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు.
ఎండాకాలం కావడంతో ఇంజిన్ వేడెక్కి ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎండాకాలం బీర్ల అమ్మకాలు జోరుగా సాగనుండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఆ మేరకు ఎంత స్టాక్ వచ్చినా మద్యం దుకాణాల్లో నిల్వ ఉండదు. ఆ క్రమంలో లారీ లోడ్ మధ్యాహ్నం బయలుదేరడం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. అదే సాయంత్రం పూట బయలుదేరి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదనే వాదనలు వినిపించాయి.