ఎన్టీఆర్ విగ్రహాం ముందు మందు బాటిళ్లు, చెత్త.. అవమానం అంటూ..
స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం అవమానం జరిగింది. విగ్రహాం ఎదుట చెత్త చెదారం ఉంది. పక్కనే మందు బాటిళ్లు కూడా దర్శనం ఇచ్చాయి. దీనిని టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి.
అవమానం..
ఎన్టీఆర్ 25వ వర్ధంతి రోజున విగ్రహానికి కర్నూలు జిల్లాలో అవమానం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ముందు గుర్తు తెలియని వ్యక్తులు చెత్త చెదారం ఉంచారు. మద్యం సీసాలు కూడా ఉంచారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు అక్కడ కనిపించిన చెత్త, మద్యం సీసాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ ఆందోళనకు దిగారు.
రాజమండ్రిలో..
ఎన్టీఆర్ 25వ వర్ధంతిని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. పేద మహిళలకు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చీరలు పంపిణీ చేశారు. తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. సీఎం జగన్ ఒక నియంతలా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్యాక్షన్ రాజకీయాలను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరులో..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. తెనాలి నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, తదితరులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గంలో పలు గ్రామాలలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. అటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్ర పటానికి టీడీపీ నేతలు గంజి, పోతినేని నివాళులర్పించారు.