వీడియో: నల్లమల అడవుల్లో పోలీసు జీపెక్కిన గ్రామ సచివాలయ పరీక్ష అభ్యర్థులు!
కర్నూలు: కర్నూలు జిల్లా పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శించారు. కొందరు అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడగలిగారు. పోలీసులు సకాలంలో స్పందించలేకపోయి ఉంటే ఆయా అభ్యర్థులు సకాలంలో పరీక్షలను రాయలేకపోయి ఉండేవారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సహకరించడం, దీనికోసం తమ జీపును వినియోగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ ఘటన ఆదివారం ఉదయం జిల్లాలోని పాములపాడు మండలంలో చోటు చేసుకుంది.
చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!
కొద్దిరోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దట్టమైన నల్లమల అడవులకు ఆనుకుని ఉన్న నిప్పులవాగు వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. నిప్పులవాగును ఆనుకుని నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని వేంపెంట గ్రామానికి చెందిన కొందరు మహిళా అభ్యర్థులు ఈ ఉదయం గ్రామ సచివాలయం పరక్షలకు హాజరు కావాల్సి ఉంది.
వేంపెంట నుంచి వారు పాములపాడుకు చేరుకోవాలంటే దారి మధ్యలో ఈ నిప్పులవాగును దాటుకోవాల్సి ఉంటుంది. నిప్పులవాగుకు వరద వచ్చిందనే విషయం ఆ అభ్యర్థులకు తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఉదయమే పాములపాడుకు బయలుదేరారు. ఆ అభ్యర్థుల్లో ముగ్గరు యువతులు నదిని దాటడానికి ఇబ్బంది పడ్డారు. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేమనే భయాందోళనలతో నదికి అవతలి ఒడ్డు వైపు నిల్చున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పాములపాడు ఎస్ఐ రాజ్ కుమార్ సకాలంలో స్పందించారు. జీపులో నిప్పులవాగు వద్దకు చేరుకున్నారు. అవతలి ఒడ్డుకు వెళ్లి అభ్యర్థులను జీపులో ఎక్కించుకుని.. పాములపాడుకు తీసుకెళ్లారు. సకాలంలో వారిని పరీక్షా కేంద్రానికి చేర్చగలిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ఐ రాజ్ కుమార్ చూపిన చొరవను నెటిజన్లు ప్రశంసిస్తారు.