మధ్యలో నువ్వెవడివి..నీకా అధికారం లేదు: ఆలయంలో ఏపీ బీజేపీ నేత దౌర్జన్యం: కేసు నమోదు
కర్నూలు: రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాలని, హిందూత్వంపై కొనసాగుతోన్న దాడులను అరికట్టాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఓ ఉద్యమాన్నే కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడం, అంతకు ముందు కొండబిట్రగుంట వంటి ఒకట్రెండు ఆలయాల్లో ఇవే తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు వరుస ఉద్యమాలకు పిలుపునిచ్చారు.
దౌర్జన్యానికి దిగిన బీజేపీ నేత..
సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో హిందువులను ఏకం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేతల జోరుకు బ్రేక్ పడేలా వ్యవహరించారు సొంత పార్టీకి చెందిన నాయకుడొకరు. ఆలయంలో అర్చకులు, సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. `మధ్యలో నువ్వెవడివి..` అంటూ విరుచుకుపడ్డారు. వారి బాధ్యతలేంటో గుర్తు చేశారు. లడ్డూ పనులు చూసుకోవాలే తప్ప అభిషేకాలు చేస్తామనానికి అధికారం లేదని అన్నారు. దీనితో అర్చకుడు, ఆలయ సిబ్బంది ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మహానంది ఆలయంలో ఘటన..
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద ఆ బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాాత మహానంది ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బీజేపీ నేత పేరు- బుడ్డా శ్రీకాంత్ రెడ్డి. బీజేపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఆయన తన అనుచరులతో కలిసి ఆలయానికి వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఆలయాల్లో భక్తుల ప్రవేశంపై, పూజాదికాలను నిర్వహించడంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
గర్భగుడిలోకి ప్రవేశించడాన్ని అడ్డుకోవడంతో..
తన అనుచరులతో కలిసి ఆలయానికి వెళ్లిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి.. గర్భగుడిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అర్చకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం.. ఎవరూ గర్భగుడిలోకి వెళ్లడానికి అనుమతి లేదని, అభిషేకాలను తాము నిర్వహిస్తామని అర్చకులు చెప్పారు. దీనికి ఆయన అంగీకరించలేదు. తాను స్వయంగా అభిషేకం చేస్తానంటూ పట్టబట్టారు. ఈ సందర్భంగా ఆయన తమపై దౌర్జన్యానికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఆ అధికారంలో లేదంటూ..
అభిషేకం తామే చేస్తామని, మధ్యలో నువ్వెవడివి అంటూ మండిపడ్డారు. అభిషేకం చేసే అధికారం నీకు లేదని చెప్పారు. తాము ఇచ్చే డబ్బులు తీసుకుని దేవాలయంలో అన్నీ సమకూర్చాల్సి ఉంటుందని, లడ్డూల పనులు చూసుకోవాలే తప్ప అభిషేకం చేయకూడదని, తన ముందు కథలు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఈ ఘటన తరువాత అర్చకులు, ఆలయ సిబ్బందిపై బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.