టీడీపీ మాజీమంత్రిపై కేసు: రైతు దీక్షలకు మద్దతుగా రహదారి దిగ్బంధం: ప్రొటోకాల్ ఉల్లంఘన
కర్నూలు: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిల ప్రియపై కేసు నమోదైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొటోకాల్ ఉల్లంఘన కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ జాతీయ రహదారిని దిగ్బంధించడాన్ని కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘనగా గుర్తించారు. అఖిల ప్రియతో పాటు ఈ ఆందోళనలో పాల్గొన్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలపైనా కేసు పెట్టారు.
14 సంవత్సరాల పాటు సీఎం: కేడర్కు క్రిమినల్ సలహాలు: ఇదేనా అనుభవం: విజయసాయి రెడ్డి
కొద్దిరోజుల కిందట సంభవించిన నివర్ తుఫాన్ రాయలసీమ జిల్లాలపై పెను ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు చేతికి అందివచ్చిన పంట నీట మునిగింది. కర్నూలు జిల్లాలో వందలాది హెక్టార్లలో పంట నాశనమైంది. నివర్ తుఫాన్ అనంతరం ఆమె ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ భూమా అఖిల ప్రియ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్కు జగన్ సర్కార్ స్పందించట్లేదనే కారణంతో ఆమె జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున కడప-కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. తన నిరసనను తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాస్తారోకో నిర్వహించడాన్ని పోలీసులు కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన కింద పరిగణించారు. అఖిల ప్రియతో పాటు పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం సెక్షన్-30 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
రైతాంగం ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి ఉద్యమించిన అఖిలప్రియపై కేసు నమోదు చేయడాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. రైతులపై ఎనలేని ప్రేమ ఉన్నట్లు చెప్నుకొంటోన్న జగన్ ప్రభుత్వం.. నివర్ పంట నష్టాన్ని సకాలంలో విడుదల చేయడంలో దారుణంగా విఫలమైందని ఆరోపించారు. రైతుల తరఫున పోరాడుతోన్న తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ద్వంద్వనీతికి నిదర్శనమని విమర్శించారు.