ఒక్కతే కూతురు: వారం క్రితమే స్కూటీ కొనిచ్చారు.. రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి
కర్నూలు: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళుతున్న ఆమెను ఓ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ దంపతులకు పెళ్లైన పదేళ్లకు శ్రావణి పుట్టింది...
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్నూలు స్పెషల్ బ్రాంచీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కాశయ్య స్థానిక రేడియో స్టేషన్ సమీపంలో నివాసముంటున్నారు. కాశయ్య దంపతులకు పెళ్లైన పదేళ్లకు కుమార్తె శ్రావణి జన్మించింది. దీంతో ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచారు.
కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ఘోరం..
తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా శ్రావణి ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ప్రస్తుతం ఆమె ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, సోమవారం సాయంత్రం కళాశాల నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. బళ్లారి చౌరస్తా దాటిన తర్వాత హనుమాన్ కాటా సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ(ఏపీ 21టీఈ6489) ఆమెను ఢీకొంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..
ఈ ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రావణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోలీసులు శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వారం క్రితమే స్కూటీ కొనిచ్చిన తండ్రి.. కన్నీరుమున్నీరుగా..
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కాశయ్య దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రావణికి వారం క్రితమే కొత్త స్కూటీని కొనిచ్చారు కాశయ్య. అంతలోనే ఈ ప్రమాదం జరిగి ఘోరం జరగడంతో కాశయ్యను ఓదార్చడం సాటి పోలీసుల వల్ల కూడా కాలేదు. తమతో ఇప్పటి వరకు సరదాగా గడిపిన శ్రావణి మృతి చెందిందన్న వార్త వినడంతో తోటి కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున మార్చూరీ వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు.