ఈ సీజన్ లో రెండోసారి: మళ్లీ శ్రీశైలం రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత: లక్ష క్యూసెక్కులు దిగువకు
కర్నూలు: రాష్ట్రంలో అతి పెద్ద జలాశయం శ్రీశైలం. కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై నిర్మించిన ఈ రిజర్వాయర్.. పూర్తిస్తాయి నీటి మట్టం నాగార్జున సాగర్ కంటే అధికం. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇంత భారీగా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఓ వర్షకాల సీజన్ లో పూర్తి నీటి మట్టానికి చేరుకోవడం దాదాపు అసాధ్యమనే చెబుతుంటారు జల వనరుల శాఖ నిపుణులు. అలాంటి రిజర్వాయర్ ఓ వర్షకాలం సీజన్ లో రెండోసారి సామర్థ్యానికి మించిన వరద ప్రవాహాన్ని నింపుకోవడం అంటే అద్భుతమేనని అంటున్నారు. తాజాగా శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను మరోసారి ఎత్తారు జల వనరుల శాఖ అధికారులు. కృష్ణా నదికి వరద ప్రవాహం సంభవించడంతో.. శ్రీశైలం జలాశయంలోకి భారీగా ఇన్ ఫ్లో నమోదవుతోంది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికిక రెండున్నర లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.
దిగువకు లక్ష క్యూసెక్కులు..
దీనితో మరోసారి గేట్లను ఎత్తారు అధికారులు. వరద నీటి ప్రవాహాన్ని దిగువకు వదిలి వేస్తున్నారు. సుమారు లక్ష క్యూసెక్కుల జలాలను వదిలి వేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వెలువడిన కృష్ణమ్య పులిచింతల ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలల్లో కృష్ణానదీ తీర పరీవాహక ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకతో పోల్చుకుంటే మహారాష్ట్రలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్, పుణే, మహాబలేశ్వర్, నాగ్ పూర్, గోండియా, అకోలా, అమరావతి, దహను, జల్ గావ్, నాశిక్ వంటి ప్రాంతాల్లో వచ్చే 36 నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల ధాటికి ముంబై మహానగరంలో సాధారణ జనజీవనం ఎంతలా అతలాకుతలమైపోయిందో తెలిసిందే. ఈ వర్షాల ధాటికి ఒకవంక కృష్ణా, మరోవంక గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
వీడియో: .అటవీ ప్రాంతంలో జీపు నుంచి జారిపడ్డ ఏడాది పసిబిడ్డ: పట్టించుకోకుండా వెళ్లిన పేరెంట్స్!
జూరాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం
తాజాగా కృష్ణానది మరోసారి వరద పోటుకు గురైంది. కర్ణాటకలోని ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలు నిండికుండల్లా మారిపోయాయి. వాటి నుంచి దిగువకు భారీగా వరద జలాలను వదిలి వేస్తున్నారు. ఫలితంగా- తెలంగాణలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల, శ్రీశైలం జలాశయం మళ్లీ నిండిపోయాయి. ఈ రెండు జలాశయాల్లో గంట గంటకీ వరద జలాల ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ మరోసారి పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లను తెరిచారు. నాలుగు గేట్లను ఎత్తేశారు. వాటి ద్వారా సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లను సైతం ఎత్తేసిన ఫలితంగా శ్రీశైలానికి 2.59 లక్షల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తడం ఇది రెండోసారి. వరద ప్రవాహానికి అనుగుణంగా మరిన్ని గేట్లను ఎత్తే అవకాశాలు లేకపోలేదని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
మరో వంక గోదావరి..
రెండు తెలుగు రాష్ట్రాల జీవన ప్రదాయినిగా పేరున్న గోదావరి నది మరోసారి వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. గోదావరి తీర ప్రాంతంలోని పలు లంక గ్రామాలు ప్రమాదం అంచున నిల్చున్నాయి. వరద బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చింది. గోదావరి నది వరద ప్రవాహానికి గురి కావడం ఈ వర్షాకాల సీజన్ లో ఇది రెండోసారి. గోదావరి నది మీద రెండు రాష్ట్రాల్లో నిర్మించిన రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండుకుండల్లా మారిపోయాయి. ఒకవంక కృష్ణా..మరోవంక గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో నీటి ఎద్దడి ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి.. వరద నీటిని దిగువకు వదులుతున్న విషయం తెలిసిందే.