Anil Kumar Yadav: ఎస్వీ మోహన్ రెడ్డి నివాసంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు విందు: మా అన్న అంటూ..!
కర్నూలు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి డాక్టర్ పాలుబోయిన అనిల్ కుమర్ యాదవ్ శనివారం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నివాసంలో విందుకు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నందికొట్కూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు అర్థర్, శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జి బీవై రామయ్య ఇందులో పాల్గొన్నారు.
జిల్లా రాజకీయాలపై చర్చ..
ఈ సందర్భంగా వారి మధ్య జిల్లా రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎస్వీ మోహన్ రెడ్డి సమీప బంధువు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. భూమా అఖిలప్రియ ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నారని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ పార్టీ ఫిరాయించి తప్పు చేసిందని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి అభిప్రాయపడినట్లు సమాచారం.
బైరెడ్డి బీజేపీలో చేరడంపై
జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తెతో సహా భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసమే బైరెడ్డి బీజేపీలో చేరి ఉండొచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. శ్రీశైలం లేదా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని వెల్లడించారు.
కర్నూలులో క్లీన్ స్వీప్.. అందుకే హైకోర్టు..
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను ఎస్వీ మోహన్ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వద్ద ప్రస్తావించగా.. ఆయన దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కర్నూలు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిందని, దీనికి ప్రతిఫలంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ విధానపర ప్రకటన చేస్తారని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.