టీడీపీ మాజీమంత్రికి ఆ సినిమా తెగ నచ్చేసిందట: ఐ మిస్ మై డ్యాడ్: ఎమోషనల్ మెసేజ్
కర్నూలు: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పర్యాటక శాఖ మాజీమంత్రి భూమా అఖిలప్రియ భావోద్వేగంతో కూడిన ఓ తాజా మెసేజ్ను ట్వీట్ చేశారు. ఆ సినిమా చూస్తున్నంత సేపూ నాన్నే గుర్తుకొచ్చారని చెప్పారు. నాన్న జీవించి ఉంటే.. ఆయనతో కలిసి ఆ సినిమాను చూసి ఉంటానని అన్నారు. మహిళా శక్తిని చాటి చెప్పిన సినిమాగా కీర్తించారు. ప్రతి ఒక్కరూ ఆ మూవీని చూడాలని రెకమెండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఓ ట్వీట్ చేశారు భూమా అఖిలప్రియ. తండ్రీకుమార్తె మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా పదేపదే గుర్తు చేసిందని అన్నారు.
టీడీపీ నేత హత్యకు సుపారీ: చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త: పీఏ అరెస్టు: సూత్రధారి అతనేనా?
ఆ సినిమా- గుంజన్ సక్సేనా. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ తాజాగా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీని కరణ్ జొహార్, హీరూ జొహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ఫ్లయిట్ లెప్టినెంట్ గుంజన్ సక్సేనా బయోపిక్గా ఈ సినిమాను నిర్మించారు. కార్గిల్ గర్ల్గా గుర్తింపు పొందిన గుంజన్ సక్సేనా వైమానిక దళంలో పనిచేవారు. కార్గిల్ యుద్ధ సమయంలో తన సేవలను అందించారు. చీతా హెలికాప్టర్లను నడపించారు. ఆమె చేసిన సేవలకు, ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గుంజన్ సక్సేనాను శౌర్య చక్రతో సత్కరించింది. ఈ పతకాన్ని అందుకున్న తొలి మహిళ కూడా ఆమే.
ఈ మూవీని చూసిన భూమా అఖిలప్రియ ప్రశంసించకుండా ఉండలేకపోయారు. తాను ఈ మూవీని చూశానని, చూస్తున్నంత సేపూ భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. మహిళా శక్తిని ఈ సినిమా ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. వైమానిక దళంలో చేరాలనుకునే ఓ యువతి తన కలను ఎలా సాకారం చేసుకున్నారనే విషయాన్ని ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారని అన్నారు. పట్టుదలతో దేన్నయినా సాధించవచ్చనే విషయాన్ని గుంజన్ సక్సేనా నిరూపించారని చెప్పారు.
Recommended Video
తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని ఈ సినిమా గుర్తు చేసిందని అఖిలప్రియ చెప్పారు. తండ్రీకుమార్తె మధ్య ఉండే ఆప్యాయతను అంతే అందంగా తెరకెక్కించారని వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ నాన్న గుర్తుకొచ్చారని అన్నారు. ఐ మిస్ మై డ్యాడ్ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. నాన్న జీవించి ఉంటే ఈ సినిమాను ఆయనతో కలిసి చూసి ఉంటానని చెప్పారు. అఖిలప్రియ తండ్రి, నంద్యాల శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి కూడా కన్నుమూశారు.