సలాం కుటుంబం ఆత్మహత్యపై నారా లోకేష్: సీబీఐకి డిమాండ్: జగన్ రెడ్డి రాక్షస మనస్తత్వం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి పరాకాష్టగా నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. నంద్యాలలో సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సలాం కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారని, ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారని నారా లోకేష్ విమర్శించారు. దీనికి ప్రభుత్వం, పోలీసు శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. సలాం కుటుంబాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, అయినా రక్త దాహం తీరలేదని మండిపడ్డారు.
రాత్రి పూట సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేశారని, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారని, ఈ వేధింపులకు భయపడి ఆయన కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు. ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని కూడా వదలట్లేదని, వారిని హింసించడం జగన్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి పరాకాష్టగా నిలిచిందని నారా లోకేష్ విమర్శించారు.
బెదిరించి, సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధ్యులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్పై ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తీసుకుందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సలాం కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు.