పుష్కర సంరంభం: ఎల్లుండి కర్నూలుకు వైఎస్ జగన్: నదీ స్నానంపై నిషేధం
కర్నూలు: రాష్ట్రంలో మరోసారి పుష్కర సంరంభం ఆరంభం కాబోతోంది. తుంగభద్ర నదీ పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కాబోతోన్నాయి. వచ్చేనెల 1వ తేదీ వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ కాలంగా దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వెళ్లనున్నారు. పుష్కరస్నానం ఆచరించనున్నారు. కరోనా వైరస్ మార్గదర్శకాలకు లోబడి స్ప్రింకర్ల ద్వారా పుష్కర స్నానాన్ని భక్తులు ఆచరించాల్సి ఉంటుంది.
పుష్కరాలను విజయవంతం చేయడానికి కర్నూలు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో 23 పుష్కర ఘాట్లను నిర్మించింది. ఘాట్ల వద్ద స్ప్రింకర్లను ఏర్పాటు చేసింది. భక్తులు వాటి కిందే స్నానం చేయాల్సి ఉంటుంది. పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడానికి అవసరమైన ప్రత్యేక ప్రాంతాలను నిర్మించినట్లు జిల్లా దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనుమతి ఉన్న పురోహితులు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేశామని, వారికి గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు తెలిపారు.
పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించింది దేవాదాయ శాఖ. రద్దీ లేకుండా చూడటానికి కడప, అనంతపురం జిల్లాల నుంచి దేవాదాయ శాఖ సిబ్బందిని కర్నూలు జిల్లాకు తరలించింది. 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించింది. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ కర్నూలుకు చేరుకుంటారని, పుష్కరాలను ప్రారంభిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Recommended Video
సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద వైఎస్ జగన్ పుష్కరస్నానం ఆచరిస్తారని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం, ఇన్ఛార్జి మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కర్నూలు నగరం పరిధిలో మొత్తం ఏడు పుష్కర ఘాట్లను నిర్మించారు. సంకల్ బాగ్, మాసా మసీదు, నాగసాయి, షిర్డీ సాయిబాబా, నగరేశ్వరస్వామి, రాంబొట్ల దేవాలయం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.