నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర పుష్కరాలు...అటు కర్నూలులో,ఇటు గద్వాలలో...
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం(నవంబర్ 20) నుంచి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప పుణ్య గడియలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కర్నూలులోని సంకల్భాగ్ ఘాట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఆలంపూర్ వద్ద మధ్యాహ్నం 1.23గంటలకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యే అబ్రహం పుష్కరాలను పారంభించ నున్నారు.
కర్నూలుకు సీఎం జగన్...
పుష్కరాల కోసం శుక్రవారం ఉదయం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్కు హెలికాప్టర్లో వెళ్తారు. అనంతరం అక్కడినుంచి కారులో తుంగభద్ర నది వరకు వెళ్తారు. పుష్కరాలు ప్రారంభించిన తర్వాత తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. 12 ఏళ్లకోసారి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
ఈసారి కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను పుష్కర స్నానానికి అనుమతిస్తారు.ఆ తర్వాత పుష్కర ఘాట్లోకి అడుగుపెట్టనివ్వరు. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్దులు పుష్కరాలకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తుతో పాటు... పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
జలకళతో తుంగభద్ర
తుంగభద్ర నది తుంగ,భద్ర అనే రెండు నదుల కలయిక. కర్ణాటకలో పుట్టిన తుంగభద్ర.. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం కుటుకనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. చివరగా సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.ఈ ఏడాది వర్షాపాతం అధికంగా నమోదు కావడంతో తుంగభద్ర జలకళతో కళకళలాడుతోంది.
Recommended Video
కర్నూలులో 23 ఘాట్లు,గద్వాలలో 4 ఘాట్లు
కర్నూలు జిల్లాలో మొత్తం 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద తాత్కాలిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పుష్కర స్నానాలను ప్రభుత్వం నిషేదించింది. ఇటు తెలంగాణలో గద్వాల జిల్లాలో నాలుగు ఘాట్లను ప్రభుత్వం పుష్కరాలకు సిద్దం చేసింది.
వేణిసోంపురం ఘాట్,రాజోళి ఘాట్,పుల్లూరు ఘాట్,అలంపూర్ ఘాట్లను భక్తులను సందర్శించవచ్చు. ఇక్కడ కూడా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అనుమతిస్తారు. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏండ్ల పైబడిన వారికి అనుమతి లేదు. కరోనా నెగటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్లోకి అనుమతి ఉంటుంది. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు. నదీ స్నానానికి అనుమతి ఇచ్చినా కోవిడ్ 19 రీత్యా అందుకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు