ఈ సారి ఏపీ వంతు: ఆళ్లగడ్డ పరిసర గ్రామాల్లో యురేనియం కోసం డ్రిల్లింగ్
కర్నూలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవులకు యురేనియం తవ్వకాల భయం ఇంకా వదల్లేదు. తమ రాష్ట్రం పరిధిలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తరువాత.. ఇక కేంద్ర ప్రభుత్వం కన్ను ఏపీపై పడింది. కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషిస్తోంది. దీనికోసం నల్లమల అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో డ్రిల్లింగ్ పనులను మొదలు పెట్టింది.
పాకిస్తాన్ పై బాంబు పేల్చిన ఐక్యరాజ్య సమితి: దివాళా తీస్తారంటూ వార్నింగ్!
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం యాదవాడ సమీపంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అణు విద్యుత్ కార్పొరేషన్ సంస్థ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆళ్లగడ్డ సహా నంద్యాల నియోజకవర్గాల్లో నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాల్లో 12 చోట్ల యురేనియం అన్వేషణ కోసం డ్రిల్లింగ్ పనులను చేపట్టారు. తొలిదశలో యాదవాడ వద్ద డ్రిల్లింగ్ వేస్తున్నారు. సుమారు 2000 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ కొనసాగవచ్చని తెలుస్తోంది.
అంత లోతు నుంచి వెలికి తీసిన రాళ్లు, మట్టి వంటి ఇతర ఖనిజాలను అణు విద్యుత్ కార్పొరేషన్ కు చెందిన లాబొరేటరీకి పంపిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అందులో యురేనియం ఆనవాళ్లు కనిపిస్తే.. అక్కడ తవ్వకాలు మొదలు పెట్టే అవకాశం ఉంది. దీనికోసం అణు విద్యత్ కార్పొరేషన్ సంస్థ అధికారులు మన రాష్ట్ర అటవీ మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి అనుమతులను తీసుకోవడం తప్పనసరి. ఇప్పటిదాకా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వాలంటూ అటవీశాఖకు ఎలాంటి ప్రతిపాదనలను రాలేదని తెలుస్తోంది.
యురేనియం కోసం డ్రిల్లింగ్ చేస్తున్న సమాచారం కాస్తా బయటికి పొక్కడంతో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. కర్నూలు నగరంలో కేవీఆర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ఈ ర్యాలీకి నేతృత్వం వహించింది. కేవీఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద భైఠాయించారు. యురేనియం తవ్వకాలకు నిరసనగా నినాదాలు చేశారు. నల్లమల అడవులను కాపాడాలంటూ నినదించారు.