కర్నూలు కదనరంగాన్ని కుదిపేసేది ఎవరు..? ఉత్కంఠ రేపుతున్న కోట్ల, కేఈ రాజకీయం..!!
కర్నూలు/హైదరాబాద్ : ఏపీ తాజా ఎన్నికల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు సాగించిన విషయం తెలిసిందే. ఇక, కర్నూలు ఎంపీ స్థానం నుంచి ఈ దఫా ఓ సంచలనమే చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయన సతీమణి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. ఐతే కొన్ని దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని కూడా మరిచిపోయి కోట్ల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కేయీ కుటుంబంతో ఎప్పటినుంచో ఉన్న వైరుద్యం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
కీలకమలుపులు తిరుగుతున్న కర్నూలు రాజకీయం..! పై చేయి ఎవరిది..!!
కర్నూలు జిల్లాలో కోట్ల వర్సెస్ కేఈ ఫ్యామిలీ మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది. ఏకంగా మూడు దశాబ్దాల పాటు ఈ రెండు ఫ్యామిలీలు రాజకీయంగా తీవ్రమైన బద్ధ శత్రువులుగా కొనసాగుతూ వచ్చారు. అలాంటి వీరిద్దరిని చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారు. కర్నూలు ఎంపీ టికెట్ను చంద్రబాబు కోట్లకు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
నైతికంగా టీడిపి బలంగా ఉంది..! కానీ ప్రజా తీర్పు ఎలా ఉందో..!!
ఉత్కంఠ పరిణామాల మద్య ఇక్కడ నుంచి వైసీపీ నాయకురాలు.. బుట్టా రేణుక విజయం సాధించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన బుట్టాకు చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో ఆమె తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. చాపకింద నీరులాగా ఆమె వైసీపీకి విజయం చేకూర్చేలా వ్యవహరించారు. ఇక, ఇక్కడ నుంచి టీడీపీ టికెట్పై కోట్ల పోటీ చేశారు. వైసీపీ తరఫున డాక్టర్ సంజీవ కుమార్ పోటీ చేశారు. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా ఎవరూ పోటీ చేయకపోవడం విశేషం.
కోట్ల, కేయీ వైరుద్యం టీడిపికి కలిసొస్తుందా..! మరింత ఇబ్బందిగా మారిందా..?
కోట్ల ఊరూ వాడా చుట్టి వచ్చారు. ముఖ్యంగా మంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా పాత వివాదాలను పక్కనపెట్టి కోట్ల ప్రచారంలో పాల్గొనడం కలిసి వచ్చిందని అంటున్నారు. వాస్తవంగా వీరిద్దరికి ఆయా నియోజకవర్గాల్లో సొంత ఓటు బ్యాంకు అంటూ లేకపోయినా బీసీ వర్గానికి చెందిన మహిళగా తనకు అన్యాయం జరిగింది అంటూ బుట్టా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ ఇద్దరుకూడా పోటీలో ఉన్న అభ్యర్థికంటే కూడా ఉత్సాహంగా వైసీపీకి ప్రచారం చేశారు.
గజిబిజి స్రుష్టించిన బుట్టా రేణుక..! జనం ఇచ్చిన తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ..!!
తాము టీడీపీలోకి వచ్చి తప్పు చేశామని, వైసీపీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా వైసీపీ చేసిన ప్రచారం గట్టిగానే సాగిన నేపథ్యంలో కోట్ల గెలుపు సాధ్యమేనా అనేది ప్రధాన ప్రశ్న. అయితే, కాంగ్రెస్లో ఉన్నసమయంలో ఉన్న హవా ఇప్పుడు ఆయనకు పెరిగిందా? లేదా? ఇక ఇటు వైసీపీ అధినేత జగన్ బీసీ అస్త్రాల్లో ఏది సక్సెస్ అయ్యాయో తేలాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.