పవన్ కళ్యాణ్ లేకుంటే గెలవలేమని వైసీపీకి అర్థమైందా, అందుకే ఇలానా?
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం ఆదోనిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మాట్లాడేందుకు జనసేనాని ఓ రైతుకు మైక్ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పవన్ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనిని వైసీపీ వర్గాలు బాగా ప్రచారం చేసుకుంటున్నాయి.
వైసీపీ మాటకు జనసేన కౌంటర్
జనసేనాని సమావేశంలో ఓ రైతు.. జగన్ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నారని వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. అంటే టీడీపీ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని దీంతో మరోసారి తేటతెల్లమయిందని చెబుతున్నారు. అయితే దీనిపై జనసేన కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తోంది. అందులోని పాజిటివ్నెస్ను చూపించే ప్రయత్నం చేసింది. అలాగే, విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పింది.
జగన్ను గెలిపించండి: పవన్ కళ్యాణ్ మైక్ ఇస్తే షాకిచ్చిన రైతు, దటీజ్ జనసేనాని.. ఏం చేశాడంటే?
పవన్ కళ్యాణ్ స్థానంలో జగన్ ఉండి ఉంటే
సదరు రైతు పవన్ కళ్యాణ్కు ఒక అడుగు దూరంలో ఉండి మాత్రమే మాట్లాడారని, జగన్ను సీఎం చెప్పమని అతను చెబుతున్నప్పటికీ కాసేపు జనసేనాని మైక్ పట్టుకొని నవ్వుతూ విన్నారని, కానీ ఇతర రాజకీయ నాయకుల్లా ప్రవర్తించలేదని జనసేన అంటోంది. ఇలాగే ఓ పవన్ కళ్యాణ్ అభిమాని.. జగన్ వద్దకు వెళ్లి ఇదే మాట చెబితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలని చెబుతున్నారు. సదరు రైతు జగన్ అభిమాని అయి ఉండవచ్చునని, అందులో తప్పులేదని, తమ కార్యక్రమాలకు ఏరికోరి జనాలను తీసుకురామని, అందరూ వస్తుంటారని, అందులో వారి వారి అభిప్రాయాలు చెబుతుంటారని అన్నారు.
పవన్ కళ్యాణ్ లేకుంటే గెలవలేమని వైసీపీకి అర్థమైందా?
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నందున తమ గెలుపుకు ఎక్కడ అడ్డుపడతారోనని, ముఖ్యంగా జనసేన వల్ల రాయలసీమలో గెలవమని వైసీపీ కార్యకర్తలకు అర్థమైందని, అందుకే పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి జగన్కు మద్దతు కోరుతున్నారని, తమలాంటి వారు ఎవరో మద్దతిస్తే గానీ జగన్ గెలవడని అర్థమైందని, అందుకే ఇలా తమ సభలకు వచ్చి బాహాటంగా అండగా ఉండమని కోరుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.