వైసీపీలో కొత్త రగడ : కర్నూలు రాజధాని కోసం సమావేశం..ఆ జిల్లాల్లో ఇలా : జగన్ వద్దకు పంచాయితీ..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీర ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే అధికార పార్టీలో భిన్న వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన పార్టీ నేతల నుండి ఒత్తిడి మొదలవుతోంది. తాజాగా మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యల కలకలం ఇప్పుడు సొంత పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో.. వైసీపీ కర్నూలు జిల్లా నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ జిల్లాకు తొలి నుండి అన్యాయం జరుగుతోందని..తమ జిల్లాను రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని వైసీపీ నేతలంతా ముఖ్యమంత్రితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అమరావతి రాజధానిగా ఉన్న రెండు జిల్లాల నేతల్లో తాజా పరిణామాలు రుచించటం లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిని ఏ రకంగా పరిష్కరిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
వైసీపీలో కొత్త పంచాయితీ...
తాజాగా మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు..అధికార వైసీపీలోనూ కలకలానికి కారణమయ్యాయి. బొత్సా వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి నుండి మారుస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో అధికార పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతలు తమ స్వరం పెంచారు. జిల్లాలో తాజా ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం రెండు లోక్ సభ స్థానాలతో పాటుగా 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది . దీంతో..ఇప్పుడు ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేలు తాజాగా తమ డిమాండ్ ను ప్రభుత్వం ముందుంచారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తే తొలి నుండి అన్యాయానికి గురవుతున్న కర్నూలు జిల్లాను రాజధాని చేయాలనేది వారి డిమాండ్ . దీని కోసం జిల్లాలోని నేతలంతా త్వరలోనే సమావేశమై..ముఖ్యమంత్రిని కలుస్తామని జిల్లాకు చెందిన వైసీపీ నుండి పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేసారు. దీనికి కొనసాగింపుగా ఎస్వీ మోహన రెడ్డి సైతం మరో ప్రకటన చేసారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ నూతన రాజధానిగా కర్నూలును ప్రకటించాలని ఇందుకోసం నేతలు రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఈ ప్రకటన ఆ జిల్లా ప్రజల మీద ప్రభావం చూపిస్తే.. రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు కారణమవుతుందనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.
విభేదిస్తున్న ఆ రెండు జిల్లాల నేతలు..
బొత్సా ప్రకటన చేసిన సమయం నుండి వైసీపీ నేతలు ఎలా స్పందించాలో తెలియక సతమతం అవుతున్నారు. సెంటిమెంట్ తో కూడిన విషయం కావటంతో పాటుగా..రాజకీయంగా ప్రభావం చూపే అంశం కావటంతో ఆచితూచి స్పందిస్తున్నారు. మంత్రి బొత్సా తన ప్రకటన తరువాత దాని పైన స్పష్టత కూడా ఇవ్వలేదు. ఇక, క్రిష్టా..గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు మాత్రం ఈ సమస్య పైన భిన్నంగా స్పందిస్తున్నారు. రాజధాని మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నారు. బొత్సా కేవలం రాజధాని ప్రాంతంలోని పరిస్థితులను మాత్రమే వివరించారని..రాజధాని మార్చే ఆలోచన లేదని వారు వివరణ ఇస్తున్నారు. అయితే, ఈ రెండు జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు అంబటి రాంబాబు..పార్ధసారధి రాజధాని మార్పు ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఇక, దీంతో పాటుగా క్రిష్టా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు మంత్రులు ఇదే విషయం పైన అంతర్గతంగా చర్చించుకున్నారు. బొత్సా వ్యాఖ్యల మీద స్పందిస్తే..మరింతగా చర్చ పెరుగుతుందని అది రాజకీయంగా ఈ రెండు జిల్లాల్లో అధికార పార్టీకి డామేజ్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకుండానే అప్పుడే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అవసరమా అనే చర్చ సైతం ఈ రెండు జిల్లాల నేతల నుండి వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి వద్దకు పంచాయితీ..
మంత్రి బొత్సా ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసారో..కానీ, ఇప్పుడు ఏపీ మొత్తంగా ఆ చర్చ సాగుతూనే ఉంది. అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా నేతలు రాజధాని తరలింపు వ్యవహారం పైన ముఖ్యమంత్రితో సమావేశం కావాలని నిర్ణయించారు. రాజధాని తరలిస్తే తమ ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేయాలని వారు ముఖ్యమంత్రిని అడగాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లాలోని అధికార పార్టీ నేతలంతా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుండి రాగానే అమరావతికి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇక, కోస్తాంధ్రకు చెందిన వైసీపీ నేతలు మాత్రం దీని పైన ముఖ్యమంత్రి రాగానే స్పష్టత వస్తుందని.. రాజధాని విషయంలో మార్పు నిర్ణయం లేదనే క్లారిటీ ఇవ్వటం ద్వారా ఈ చర్చకు ముగింపు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కొంత మంది సీనియర్లు మాత్రం రాజధాని మార్చకపోయినా కొన్ని మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు ఉంటాయని అంచనాతో ఉన్నారు.