మరో వివాదంలో వైసీపీ !? కార్యకర్తలపై నోట్లవర్షం! ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ కార్యకర్తల గుంపుపైకి వైఎస్ఆర్ సీపీకే చెందిన నాయకుడొకరు నోట్లను వెదజల్లారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శిరివెళ్ల మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆలస్యంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల కిందటే- నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వివాదాస్పద కామెంట్లను చేసిన వీడియో వెలుగు చూసిన విషయం తెలిసిందే. 2018 జనవరి 5వ తేదీన చోటు తీసిన వీడియో అని, ఎన్నికల సందర్భంగా లబ్ది పొందడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తాజాగా దాన్ని వైరల్ చేశారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
నోట్ల కోసం ఎగబడ్డ కార్యకర్తలు
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున గంగుల బిజేంద్ర రెడ్డి ఆలియాస్ నాని పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియా టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నియోజకవర్గం పరిధిలోని శిరివెళ్ల మెట్ట మండలానికి వెళ్లారు బిజేంద్ర రెడ్డి. ఇంటింటికీ వెళ్లి, ప్రచారం చేస్తున్న సమయంలో, ఆయన వెంట వచ్చిన ఇద్దరు ముస్లిం నేతలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అన్వర్ భాషా, సలీమ్ అనే నాయకులు తమ చేతుల్లో ఉన్న నోట్లను గాల్లోకి విసిరేస్తూ కనిపించారు. నోట్లను అందుకోవడానికి పార్టీ కార్యకర్తలు ఎగబడటం ఇందులో చూడొచ్చు. 20 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్ సీపీ నాయకుల వద్ద దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయని, అందుకే వాటిని ఇష్టానుసారంగా విసిరేస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈసీకి ఫిర్యాదు..
ఈ ఘటనపై ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియా ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. డబ్బులు వెదజల్లుతున్న విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఆమె విజ్ఞప్తి మేరకు పోలీసులు..నోట్లను వెదజల్లిన అన్వర్ భాషా, సలీమ్ లపై కేసు నమోదు చేశారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున దోచుకుని, దాచుకున్నారని అఖిలప్రియ ఆరోపించారు. ఆ డబ్బును విస్తృతంగా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. తనను ఓడించడానికి ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని, దాని వల్ల ఆయనకు ఒరిగేదేమీ ఉండదని చెప్పారు. తనను ఓడించడం సాధ్యం కాదని అఖిలప్రియ సవాలు విసిరారు. ఓటమి భయంతోనే తన ప్రత్యర్థి గంగుల బిజేంద్ర రెడ్డి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బిజేంద్ర రెడ్డి ఓటమి తథ్యమని, కనీసం 50 వేల మెజారిటీతో తాను గెలుస్తానని అన్నారు.
పాత వీడియో అంటోన్న వైఎస్ఆర్సీపీ..
నోట్లను వెదజల్లుతున్న వీడియో చాలా పాతదని ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. గత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తగా విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని అంటున్నారు. డబ్బులను వెదజల్లే అలవాటు తమకు లేదని అంటున్నారు. భూమా అఖిల ప్రియ తన ఓటమి తప్పదనే భయం వల్లే ఎప్పుడో జరిగిన వీడియోను కొత్తగా సోషల్ మీడియాలోకి విడుదల చేసి, తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. గంగుల ప్రతాప రెడ్డి కుటుంబం కూడా తమకే మద్దతు పలకడాన్ని అఖిలప్రియ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబంపై బురదజల్లడానికే పాత వీడియోను వెలికి తీశారని వైఎస్ఆర్ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన గంగుల ప్రతాప రెడ్డి..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు గంగుల ప్రతాప్రెడ్డి ఇటీవలే వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బిజేంద్ర రెడ్డికి తాము మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. గంగుల బిజేంద్రరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యలు ప్రతాప్రెడ్డిని కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా బిజేంద్ర రెడ్డి కోరగా.. దీనికి ప్రతాప రెడ్డి అంగీకరించారు. బిజేంద్రరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గంగుల ప్రతాప్రెడ్డి బహిరంగ ప్రకటన కూడా చేశారు. తనకు నంద్యాల లోక్ సభ టికెట్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే తాను టీడీపీని వీడుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా నంద్యాల ఎంపీ సీటు కోసం మాండ్ర శివానంద రెడ్డిని ఎంపిక చేశారని ఆరోపించారు. అందుకే బిజేంద్ర రెడ్డిని గెలిపిస్తామని అన్నారు.