వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: క్వారంటైన్: ఆరోగ్యంపై ఏం చెప్పారంటే..ఆ జిల్లాలో ఇలా
కర్నూలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి, కోలుకున్నారు. తాజాగా- ఆ జాబితాలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేరారు. తాను కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు. తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
కొత్త వైరస్ స్ట్రెయిన్ పుట్టుకొచ్చిన వేళ: తెలంగాణలో మారుతోన్న కరోనా లెక్కలు: మళ్లీ మొదటికి?
కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని కొద్దిరోజులుగా ఆయన రోజూ నిర్ధారణ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఆ తరువాతే- నియోజకవర్గ పర్యటనలకు వెళ్తున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమౌతున్నారు. తాజాగా- ఆయన వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించట్లేదని సన్నిహితులు చెబుతున్నారు. అసింప్టోమేటిక్గా నిర్ధారించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని శిల్పా రవి వెల్లడించారు. తాను ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నానని పేర్కొన్నారు.
తన ఆరోగ్యం పట్ల ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు విధిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లాలని అన్నారు. తమ వల్ల కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, అది వారి కుటుంబాలకే కాదు..మిగిలిన వారికీ ప్రమాదమని చెప్పారు.
ఇదిలావుండగా..మంగళవారం సాయంత్రం అధికారులు విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. కర్నూలు జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఈ జిల్లాలో 60,548 కేసులు రికార్డు అయ్యాయి. ఇందులో 60,002 మంది రికవరీ అయ్యారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. 487 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసులు 59 మాత్రమే. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలి రోజుల్లో ఈ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.