నలుగురు అక్కాచెల్లెళ్ల సూసైడ్ అటెంప్ట్.. జడ్చర్లలో కలకలం
జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో కలకలం రేగింది. నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం చర్చానీయాంశమైంది. గురువారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ఒక కుటుంబంలో ఆరుగురు ఆడపిల్లలున్నారు. ఇంకా ఎవరికీ వివాహం కాలేదు. అయితే అందులో ఒక అమ్మాయి బుధవారం నాటి నుంచి కనిపించడం లేదు. ఆమె గురించి రోజంతా వెళ్లినా ప్రయోజనం కన్పించలేదు. ఆ యువతి జాడ దొరకక కుటుంబ సభ్యులు తీరని వేదనకు గురయ్యారు. చివరకు ఓ యువకుడితో సదరు యువతి వెళ్లినట్లు తెలిసింది.
సర్కార్ స్కూళ్లకు పెరుగుతున్న క్యూ.. గవర్నమెంట్ బడికి జడ్జి కూతుళ్లు
దాంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. తమకన్నా చిన్నదైన చెల్లె ఇంటి నుంచి అలా వెళ్లిపోవడం నలుగురు అక్కలు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబం పరువు పోయిందని కలత చెందారు. ఆ క్రమంలో ఆ నలుగురు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్న సమయంలో అడ్డురాకుండా ఉండేందుకు చిన్న చెల్లెను, తల్లిని వేరే గదిలో ఉంచి గొళ్లెం వేశారు.
తలుపు తీయాలని ఆ ఇద్దరూ ఎంత అరిచినా వారు వినిపించుకోలేదు. చివరకు ఎలాగోలా ఆ గది నుంచి బయటపడి వీధిలోకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు పోగయ్యారు. అప్పటికే ఆ నలుగురు పురుగుల మందు సేవించడంతో వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.