ఆగని వలసలు : కార్మికులుగా కర్షకులు, పిల్లల కోసం లేబర్గా, ఇదీ పాలమూరు వలసల వ్యధ
పాలమూరు : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వ రాష్ట్రం సిద్ధించిన నిధులు, నియామకాల సంగతెందో కానీ నీళ్ల గోస తీరడం లేదు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య విలయతాండవం చేస్తుండగా .. పాలమూరు వలసలు కంటిన్యూ అవుతున్నాయి. తమకు భూమి ఉన్న పండించుకోని దీనస్థితి అన్నదాతది. ఉన్న ఊరుని, కన్నవారిని వదిలి పొట్టకూటి కోసం పాలమూరు వాసులు వలసబాట ఇంకా కొనసాగుతూనే ఉంది.
తీరని కష్టాలు ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందనే భావన ఉండేది. కానీ ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, వరణుడు కరుణించకపోవడంతో పాలమూరు వాసుల వలసలు నిరంతరాయంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంటిని కదిలించిన ఒక్కటే చెప్తారు. పిల్లల చదువులు, పొట్ట కూటి కోసం ముంబై ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందని చెప్తున్నారు.
పావుశాతం జనాభా వలసలు ..
పాలమూరు చుట్టూ నదులు, వాగులు ఉన్న ఒడిసిపట్టక పోవడంతో వలసవెళ్లక తప్పడం లేదు. అయితే ఉమ్మడి పాలమూరులో జిల్లాలో మొత్తం జనాభా 42 లక్షలు కాగా దాదాపు 15 లక్షల మంది వలసవెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఊరిలో సాగునీరు లేక భూమి ఉన్న వ్యవసాయం చేయలేని దుస్థితి అన్నదాతది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ముంబైకి వలసపోతున్నారు. పిల్లలను హాస్టళ్లలో వేసి ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి తరలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వలసలు తప్పకపోవడంతో కొందరు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
కర్షకులు కాస్త కార్మికులుగా ..
అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా మారిపోతున్నారు. భార్యభర్తలిద్దరికీ నెలకు రూ.50 వేలు ఇచ్చి తీసుకెళ్తున్నాడు కాంట్రాక్టర్. అయితే అక్కడ సరైన వసతి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు వారు. ఇక ఆరోగ్యం బాగోలేకపోతే అంతే సంగతి. ఇంటికి తిరిగొచ్చారే .. తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టర్ ముక్కుపిండి మరీ వసూల్ చేస్తారు. వాస్తవానికి భార్య, భర్తను పనికి తీసుకెళ్తే ఇక్కడ రెవెన్యూ రిజిస్ట్రేషన్ చేయించాలి. జీవిత బీమా కూడా తప్పనిసరి కానీ .. ఈ నిబంధనలేమి పాటించడం లేదు సదరు కాంట్రాక్టర్లు. తమకు ఉపాధే ముఖ్యమని .. పత్రాలు కాదని వారు కూడా బెట్టు చేయకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది.
కూలీలుగా ..
పాలమూరు పరిధిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఇక్కడి ప్రజలు వసలబాట తప్పడం లేదు. తమ పరిధిలో నిర్మించే ప్రాజెక్టుల్లోనే కూలీలుగా పనిచేస్తున్న దీన పరిస్థితి వారింది. అంబేద్కర్ లిప్ట్ ఇరిగేషన్ పథకం పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుగా మార్చారని ఇక్కడి స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులో కూడా పాలమూరు కార్మికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం 67 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయినా ప్రాజెక్టు పూర్తికాక మిగిలిన గ్రామాలకు సాగునీటి సమస్యలు తప్పడం లేదు. డిండి, జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పని కూడా ముందుకుసాగని పరిస్థితి. జూరాల ప్రాజెక్టు మొత్తం పరిమితి 20 టీఎంసీలు పైగానే అయితే కర్ణాటక అభ్యంతరం 6 టీఎంసీలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాజెక్టులో ఇమిడే నీరు సాగుకు సరిపోదని రైతులు నిట్టూరుస్తున్నారు. అంతేకాదు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పాలమూరు కార్మికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. దాదాపు 50 వేల మంది కార్మికులు ప్రాజెక్టుల్లో కూలీలుగా మారారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్లో కూడా పాలమూరుకు చెందిన 160 మంది కార్మికులు పనిచేస్తున్నారనే కఠోర సత్యాన్ని తెలిపారు.