కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగు
మంచిర్యాల : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. నాలుగు స్థానాల్లో గెలిచి మోడీకి బహుమానంగా అందించింది. అయితే ఆ మూడు చోట్ల గెలిచి.. పక్కనే ఉన్న మరో సెగ్మెంట్లో ఓడిపోవడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను క్రెడిట్ చేసుకుని ఆ మూడు స్థానాల్లో బీజేపీ పాగా వేస్తే.. ఆ పక్క నియోజకవర్గంలో వెనుకబడటమేంటనేది జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అదే బెల్టులోని పెద్దపల్లిలో మాత్రం బీజేపీకి నిరాశే ఎదురైంది. అక్కడ టీఆర్ఎస్ గెలవడాన్ని కమలనాథులు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఒక్క స్థానంలో కూడా గెలిస్తే బీజేపీకి మరింత పట్టు పెరిగేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ మూడు చోట్ల గెలుపు.. పెద్దపల్లిలో ఏమైంది..!
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ జెండా రెపరెపలాడింది. సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ఎంపీలుగా గెలిచారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన హిందూగాళ్లు, బొందుగాళ్లు వ్యాఖ్యలు టీఆర్ఎస్కు దెబ్బ కొట్టాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మూడు చోట్ల కూడా కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయనే టాక్ నడుస్తోంది. మోడీ ఛరిష్మా, బీజేపీ శ్రేణుల పట్టుదల, కేసీఆర్ వ్యాఖ్యలు వెరసి బీజేపీ జెండా రెపరెపలాడిందని చెప్పొచ్చు.
గెలిచిన ఆ మూడు చోట్ల స్థానిక బీజేపీ నేతలు.. కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థవంతంగా వాడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి కౌంటర్గా టీఆర్ఎస్ నేతలు స్పందించలేదనే వాదనలున్నాయి. అయితే అటు పెద్దపల్లిలో మాత్రం బీజేపీ ఓడిపోవడమేంటనేది కమలనాథులను వేధిస్తున్న ప్రశ్న. ఆ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తే.. పెద్దపల్లిలో మాత్రం మూడో స్థానానికి పరిమితం కావడం ఆశ్చర్యమేస్తోందని అంటున్నారు.
గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!
మూడో స్థానంలో బీజేపీ..!
పెద్దపల్లి లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ నుంచి బొర్లకుంట వెంకటేశ్, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్.కుమార్ బరిలో నిలిచారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపించింది. ముందస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి బాల్క సుమన్ చేతిలో వెంకటేశ్ ఓడిపోయారు. తిరిగి అదే బాల్క సుమన్ సాయంతో అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి టికెట్ దక్కించుకుని ఎంపీగా గెలుపొందారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో టీఆర్ఎస్కు చెక్ పెట్టి విజయం సాధించిన బీజేపీ.. పెద్దపల్లిలో ఓటమి చెందడం వెనుక కారణాలేంటని అధిష్టానం విశ్లేషిస్తోంది. అభ్యర్థి ఎంపికలో తప్పిదం జరిగిందా.. లేదంటే పార్టీ క్యాడర్ బలంగా లేకపోయిందా అనే అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ.. బీజేపీ అభ్యర్థి ఓట్లు..!
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీఆర్ఎస్.. ఐదు నెలల వ్యవధిలో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో డీలా పడింది. 2014 నాటి లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా మెజార్టీ తగ్గింది. అప్పుడు పెద్దపల్లి నుంచి గెలిచిన బాల్క సుమన్కు 2 లక్షల 90 వేల పైచిలుకు మెజార్టీ దక్కింది. ఈసారి బొర్లకుంట వెంకటేశ్కు మాత్రం 95వేల పైచిలుకు మాత్రమే మెజార్టీ వచ్చింది.
పెద్దపల్లి సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్కు కేవలం 92 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి సాధించిన మెజార్టీ అంతన్నమాట. కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ స్థానికేతరుడైనప్పటికీ 3 లక్షల 46 వేల పైచిలుకు ఓట్లు రావడం గమనార్హం. మొత్తానికి ఈ సెగ్మెంట్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేపోయిందనేది స్పష్టమవుతోంది.
బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఉంటే.. కచ్చితంగా బీజేపీదే గెలుపు..!
పెద్దపల్లిలో బీజేపీ ఓడిపోవడాన్ని ఆ పార్టీశ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పక్కనే ఉన్న మూడు సెగ్మెంట్లలో బంపర్ మెజార్టీ సాధిస్తే.. పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి ఏమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో బలమైన అభ్యర్థులు ఉండటం కూడా ఆ పార్టీకి ప్లస్ అయిందనే టాక్ నడుస్తోంది. అదే రీతిలో పెద్దపల్లిలో కూడా స్ట్రాంగ్ అభ్యర్థిని నిలబెడితే.. ఆ సెగ్మెంట్ కూడా కమలం ఖాతాలో పడి ఉండేదనే చర్చ జరుగుతోంది.
పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ బొర్లకుంట వెంకటేశ్కు ఇవ్వడంతో.. ఆ పార్టీ నుంచి జి.వివేక్ బయటికొచ్చారు. ఆ సందర్భంలో బీజేపీ నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ హైకమాండ్ ప్రయత్నించినా కుదరలేదు. ఒకవేళ వివేక్ను గనక పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా నిలబడితే ఆ స్థానం కూడా కచ్చితంగా బీజేపీకి వచ్చేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు అర్థబలం, అనుచరగణం మెండుగా ఉండటంతో గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉండేందంటున్నారు చాలామంది. మొత్తానికి పెద్దపల్లిలో బీజేపీ గెలవలేకపోవడం ఆ పార్టీశ్రేణుల్లో నైరాశ్యం నింపింది.