సహజీవనం.. హోంగార్డు మోసం.. గర్భవతిని చేసి, చివరకు..!
మంచిర్యాల : ప్రజా రక్షణ కోసం పాటుపడాల్సిన ఓ హోంగార్డు దారి తప్పాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఓ యువతిని వంచించాడు. పెళ్లైన కూడా అవివాహితుడిగా నమ్మించి ఆమెను ముగ్గులోకి దించాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానంటూ మాట ఇచ్చి సహజీవనం చేశాడు. ఆ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి మాట ఎత్తేసరికి జంపయ్యాడు. విషయం ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లి మొట్టికాయలు పడ్డా కూడా అతడిలో మార్పు లేదు. న్యాయం కోసం బాధితురాలి కుటుంబ సభ్యులు పోరాడుతున్న ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమ పేరుతో ట్రాప్.. పెళ్లి పేరుతో సహజీవనం
కొమరం భీం జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన జాదవ్ సజన్ లాల్.. ఆసిఫాబాద్ ఏఆర్ హెడ్క్వార్టర్స్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. వివాహితుడైన సజన్ లాల్కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన విషయం దాచి దంపూర్ గ్రామానికి చెందిన 28 సంవత్సరాల దుర్వా అరుణ అనే గిరిజన యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. వివాహం చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు.
ఆ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే పెళ్లి చేసుకోవాలంటూ ఆమె కోరినప్పుడల్లా దాటవేస్తూ వచ్చాడు. చివరకు ఆమెకు ఓపిక నశించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఉన్నతాధికారులు సజన్ లాల్ను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే అరుణను పెళ్లి చేసుకుంటానని అక్కడ ఒప్పుకున్నాడు. డెలివరీ ఛార్జీలు కూడా తానే భరిస్తానంటూ హామీ ఇచ్చాడు.
వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!
ఉన్నతాధికారులు చెప్పినా.. తీరు మారని హోంగార్డు
నిండు గర్భిణీ కావడంతో ఈనెల 4వ తేదీన అరుణకు పురిటినొప్పులు వచ్చాయి. దాంతో ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి డాక్టర్లు మంచిర్యాల హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లిన క్రమంలో అరుణ పరిస్థితి ఉందోళనకరంగా మారింది. దాంతో వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కానీ సజల్ లాల్ ఆమెను తిరిగి ఆసిఫాబాద్ తీసుకొచ్చి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు.
సదరు యువతి కుటుంబ సభ్యులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన సూచన మేరకు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఆ క్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు కడుపులో నొప్పి రావడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. కానీ, అంతలోనే ఆమె చనిపోయింది. దాంతో అరుణ బంధువులు రిమ్స్కు చేరుకుని ఆందోళనకు దిగారు. సదరు హోంగార్డును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యుల ఆందోళన.. న్యాయం చేస్తామని హామీ
ప్రేమ, పెళ్లి పేరిట హోంగార్డు సజన్ లాల్ తమ కూతురును వంచించాడని ఆమె తండ్రి నాందేవ్ ఆరోపించారు. 9 నెలలుగా తమకు న్యాయం చేయాలని స్థానిక సీఐ చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. హోంగార్డు తమ శాఖకు చెందినవాడు కావడంతోనే పోలీసులు తమను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలియగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎస్పీ సత్యనారాయణ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అరుణను వంచించడమే గాకుండా ఆమె మృతికి కారణమైన హోంగార్డు సజన్ లాల్ పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
వీడియో : లడఖ్లో ఆనందోత్సాహాలు.. స్థానికులతో ఎంపీ డ్యాన్స్
శిశు సంరక్షణ కేంద్రానికి తరలింపు
అరుణ మరణంతో ఆమెకు జన్మించిన మగబిడ్డను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సావిత్రికి అప్పగించారు. అనంతరం ఆమె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. గిరిజన మహిళకు జరిగిన అన్యాయానికి కారణమైన హోంగార్డు సజన్ లాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది.