కలెక్టర్ నివాసానికే కరెంట్ కట్ చేసిన మంచిర్యాల విద్యుత్ శాఖాధికారులు .. ఏం జరిగిందంటే
మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విద్యుత్ కట్ చేసి షాకిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు నివాసముంటున్న గృహాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. పొరబాటు గ్రహించి ఆ తర్వాత విద్యుత్ పునరుద్ధరించారు .
ప్రాణాలను పణంగా పెట్టి .. వరదలో కొట్టుకుపోతున్న కుక్కను కాపాడిన తెలంగాణ పోలీస్
అసలు విషయానికి వస్తే జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జిల్లాలలో నివసిస్తున్న ఉన్నతాధికారులకు నివాసాలకు భవనాలు లేక పోవడంతో చాలా జిల్లాలలో ప్రత్యామ్నాయంగా నివాస భవనాలను ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే తరహాలో ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులకు నివాస భవనాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కలెక్టర్ కార్యాలయాలకు భవనాల నిర్మాణం జరుగుతున్న క్రమంలో తాత్కాలిక ఏర్పాటులో భాగంగా ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ భవనాలను కేటాయించింది .
జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కలెక్టర్ తో పాటు, ఇతర అధికారులు ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ లో ఉన్న భవనాలలో నివాసముంటున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం, అడిషనల్ కలెక్టర్ నివాసం, డీసీపీ నివాసాల కోసం ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ ను కేటాయించారు. అయితే ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత రెండేళ్ల నుండి ఫ్యాక్టరీ కి సంబంధించిన విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో 11 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.
పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ కి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. అయితే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో కలెక్టర్ నివాసంతో పాటు ఇతర ఉన్నతాధికారుల నివాసాలు ఉన్న విషయం విద్యుత్ శాఖాధికారులు గుర్తించలేదు. దీంతో ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో ఉన్న అధికారులు ఇళ్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. గుర్తించిన విద్యుత్ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లుగా సమాచారం.