సీనియర్ సిటిజన్ కు సీటు ఇవ్వలేదట.. ఆర్టీసీకి 6 వేలు ఫైన్
సంగారెడ్డి : సీనియర్ సిటిజన్ ఆర్టీసీపై విజయం సాధించారు. బస్సు ప్రయాణంలో తనకు సీటు ఇప్పించకుండా నిర్లక్ష్యం వహించిన కండక్టర్ పై ఫిర్యాదు చేస్తూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆయన కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ తీరును తప్పుపట్టింది. బాధితుడికి 6 వేల రూపాయలు చెల్లించాలని సంబంధింత డిపో మేనేజర్ కు ఆదేశాలు జారీచేసింది.
సీటివ్వలేదని.. సీనియర్ సిటిజన్ విజయం
సీనియర్ సిటిజన్ కు సీటు ఇప్పించకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కండక్టర్ కు మొట్టికాయలు పడ్డాయి. మెదక్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణించిన సదరు పెద్దాయన కూర్చోవడానికి కండక్టర్ సహకరించలేదట. సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చోవడంతో ఆయన కండక్టరును ఆశ్రయించారు. వాస్తవానికి ఆ సీట్లలో కూర్చున్నవారిని లేపి.. ఆ పెద్దాయనను కూర్చోబెట్టాల్సిన బాధ్యత సంబంధిత కండక్టర్ దే.
అయితే ఆ పెద్దాయన మాటలు కండక్టర్ పట్టించుకోలేదట. దీంతో ఆ సీనియర్ సిటిజన్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఫోరం పెద్దలు కండక్టర్ తీరును తప్పుపట్టారు. దాంతో బాధితుడికి 5వేల రూపాయల నష్టపరిహారంతో పాటు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 6వేల రూపాయలు చెల్లించాలని మెదక్ డిపో మేనేజర్ కు ఆదేశాలు జారీచేశారు.
కండక్టర్ నిర్లక్ష్యం.. డిపో మేనేజర్ అలక్ష్యం
సంగారెడ్డిలోని శాంతినగర్ కు చెందిన సీనియర్ సిటిజన్ నాగేందర్ వృత్తిరీత్యా న్యాయవాది. 2017, జూన్ 18న ఉదయం సమయంలో పని నిమిత్తం రామాయంపేటకు వెళ్లే క్రమంలో మెదక్ డిపోకు చెందిన బస్సు ఎక్కారు. బస్సులో వీపరీతమైన రద్దీ ఉండటంతో సీనియర్ సిటిజన్ సీట్ల దగ్గరకు వెళ్లారు. అప్పటికే ఆ సీట్లలో యువకులు కూర్చున్నారు. దాంతో నాగేందర్ కండక్టరును ఆశ్రయించారు. వారిని లేపి తనకు సీటు కేటాయించాల్సిందిగా అభ్యర్థించారు.
కానీ సదరు కండక్టర్ ఆయన మాటల్ని పెద్దగా పట్టించుకోక విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. సీనియర్ సిటిజన్ అయినప్పటికీ గమ్యస్థానం చేరేంతవరకు బస్సులో నిల్చోవాల్సి వచ్చింది. అయితే కండక్టర్ నిర్లక్ష్యంపై మెదక్ డిపో మేనేజర్ కు బాధితుడు నోటీసులు జారీచేశారు. ఆయన స్పదించకపోవడంతో చివరకు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు నాగేందర్.
కండక్లర్లకు ట్రైనింగ్ ఇవ్వండి..!
నాగేందర్ ఫిర్యాదును స్వీకరించిన జిల్లా వినియోగదారుల ఫోరం విచారణ చేపట్టింది. సర్వీస్ లోపంతో పాటు కండక్టర్ నిర్లక్ష్యం ఉందని తేల్చింది. దాంతో కండక్టరును, డిపో మేనేజర్ ను బాధ్యులుగా చేస్తూ జరిమానా విధించింది. బాధితుడికి 6వేల రూపాయలు చెల్లించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం వెంటనే చెల్లించడంతో పాటు.. డ్యూటీలో కండక్టర్లు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించేలా సూచనలు జారీచేయాలని పేర్కొంది.