చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ.. తిరగబడ్డ మహిళలు.. చివరకు..!
మెదక్ : రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఫాలో అవుతూ అదనుచూసి మహిళల గొలుసులు కొట్టేస్తున్నారు. అయితే చాలా కేసుల్లో నిందితులు పట్టుబడకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అదలావుంటే తాజాగా మెదక్ జిల్లాలో చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళలు తిరగబడటంతో వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పరారయ్యారు.
బుధవారం నాడు జోగిపేట పట్టణంలోని ఆర్య సమాజ్ కాలనీలో చైన్ స్నాచర్లకు ఊహించని షాక్ ఎదురైంది. ఇంటిమెట్లపై కూర్చున్న భారతమ్మ అనే మహిళ దగ్గరకు వచ్చిన ఇద్దరు దుండగులు ఏదో సమాచారం కావాలన్నట్లుగా నటించారు. ఆమె అలా కాస్తా వంగి అదిగో అటువైపు వెళ్లాలన్నట్లుగా వేలు చూపించే క్రమంలో మెడలో నుంచి బంగారు గొలుసు తెంపేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ ప్రభుత్వం కరెంటు బాకీలు.. ఎన్ని కోట్లంటే.. కష్టాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు..!
అయితే ఈ ఘటనలో చైన్ స్నాచర్ల ఆటలు సాగలేదు. భారతమ్మ వెంటనే అప్రమత్తమై బంగారు గొలుసును పట్టుకున్న దొంగను గట్టిగా పట్టుకున్నారు. అంతలోనే అక్కడకు చేరుకున్న కొందరు మహిళలు ఆ దుండగులపై తిరగబడ్డారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న సదరు చైన్ దొంగలు ఎలాగోలా తప్పించుకుని అక్కడినుంచి వట్పల్లి వైపుగా పారిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు అలర్టయ్యారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దుండగులు దొరక్కపోయినప్పటికీ.. భారతమ్మ అప్రమత్తంగా ఉండటంతో ఆమె మెడలో చైన్ మాత్రం తెంచలేకపోయారు.
స్పాట్కు చేరుకున్న పోలీసులు బాధితురాలితో పాటు అక్కడున్నవారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీటీవిల నుంచి ఫుటేజ్ తీసుకుని పరిశీలిస్తున్నారు. సదరు దుండగులు డాకూరు రోడ్డు మీదుగా పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. కర్ణాటకు ముఠాకు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.