చిననాటి దోస్తులు, గ్రామ ప్రజలు.. ఆత్మీయ కలయిక.. జన్మభూమిలో కేసీఆర్ సందడి
మెదక్ : సొంతూరిలో సీఎం కేసీఆర్ సందడి చేశారు. మెదక్ జిల్లాలోని చింతమడకకు చేరుకున్న కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. జన్మభూమిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చింతమడక వాస్తు అద్భుతమని.. ఈ గడ్డపై పుట్టడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. తనను ఇంతటివాడిని చేసిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని భావోద్వేగంగా మాట్లాడారు.
జన్మభూమిపై సీఎం వరాల జల్లు
మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన సీఎం కేసీఆర్ జన్మభూమిపై మమకారంతో వరాల జల్లు కురిపించారు. కేసీఆర్తో పాటు ఆయన భార్య శోభారాణి, తనయుడు కేటీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులు చింతమడకకు చేరుకున్నారు. సొంతూరు పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని పథకాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా పలు అంశాలు ప్రస్తావించారు.
జన్మభూమి పర్యటనలో మాట్లాడిన కేసీఆర్.. చింతమడక గడ్డపై పుట్టడం తన అదృష్టంగా అభివర్ణించారు. అంతేకాదు చింతమడక వాస్తు అద్భుతమని కితాబిచ్చారు. తనను ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన ఇక్కడి గ్రామస్తులకు నమస్కారం అంటూ ప్రసంగించారు.
బిగ్బాస్ షో పై హన్మంతన్న గరం.. నాగార్జునను కూడా ఏకిపారేశారుగా..!
చింతమడకలో చింతలు ఉండవు ఇక.. కేసీఆర్ హామీ
చింతమడకను చింతలు లేకుండా చేస్తానంటూ హామీ ఇచ్చారు కేసీఆర్. గ్రామంలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు. చింతమడక చాలా మంచి ఊరని పొగడ్తల వర్షం కురిపించిన కేసీఆర్.. గ్రామాభివృద్ధికి ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని హితవు పలికారు.
మూడు నాలుగు నెలల వ్యవధిలో చింతమడకలో అభివృద్ధి పనులు పూర్తి కావాలన్న కేసీఆర్.. ఈ గ్రామాన్నే కాదు నియోజకవర్గమంతటా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు చింతమడకలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ఏవిధంగానైతే బాగు చేశానో.. చింతమడకను కూడా అదేవిధంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను మన దగ్గర ప్రవేశపెట్టానని.. రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రారంభించిన రోజు చాలా సంతోషించినట్లు చెప్పారు.
చిననాటి స్నేహితులతో ఆత్మీయంగా.. ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్న కేసీఆర్
చింతమడక నుంచి ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలుకుతామన్నారు కేసీఆర్. ఎక్కడ ఏమి జరిగినా.. క్షణాల్లో వైద్యం అందేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ఇక్కడి గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేయిస్తామని.. వాటికి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. అందులోభాగంగా వైద్యారోగ్య శిబిరాలు ఊరంతా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామస్తులతో ఆత్మీయ సమావేశానికంటే ముందు తన చిననాటి మిత్రులను కలుసుకున్నారు కేసీఆర్. వారిని అప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. కొందరు గ్రామస్తులు సమర్పించిన వినతి పత్రాలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.