ఒక్క ఫోన్ కాల్.. రైతు డబ్బులు మాయం.. గ్రామాలకు పాకిన సైబర్ మోసం
మెదక్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతూ జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. దొంగతనాలకన్నా ఇదే ఈజీగా ఉండటంతో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒక్క ఫోన్ కాల్తో అమాయకుల జేబులకు చిల్లు పెడుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఇన్నాళ్లు నగరాలకే పరిమితమైన ఇలాంటి మోసాలు ఇప్పుడు గ్రామాలకు పాకడం గమనార్హం.
ఎక్కడో ఏసీల్లో కూర్చుంటారు. సేకరించిన ఫోన్ నెంబర్లను డయల్ చేస్తుంటారు. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామంటూ నమ్మించి జనాలను మోసగిస్తారు. ఏటీఏం నెంబర్ తదితర వివరాలు తీసుకుని క్షణాల వ్యవధిలో వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తారు. ఇదంతా సైబర్ నేరగాళ్ల మోసాల తీరు.
అవినీతి అక్రమాలు వద్దు.. పారదర్శకంగా సేవలు.. కొత్త అర్బన్ పాలసీపై కేసీఆర్ దిశానిర్దేశం
ఒకే ఒక్క ఫోన్ కాల్.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు..!
ఒక్క ఫోన్ కాల్.. జనాల జేబుకు చిల్లు పెడుతోంది. నగరాలకే పరిమితమైన సైబర్ మోసాలు ఇప్పుడు గ్రామాలకు చేరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కమ్మరి సాయిలును బోల్తా కొట్టించారు మోసగాళ్లు. పొలం పనులు చేసుకుంటున్న సమయంలో.. సాయిలుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అదే ఆయన కొంప ముంచింది.
ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానంటూ గుర్తు తెలియని వ్యక్తి సాయిలుకు ఫోన్ చేశాడు. మీ ఏటిఎం కార్డు ఇకపై పనిచేయదని.. ఒకటి రెండ్రోజుల్లో కొరియర్ ద్వారా కొత్త కార్డు వస్తుందని నమ్మించాడు. ఆ క్రమంలో కొన్ని వివరాలు తీసుకుని అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయం చేశాడు.
బ్యాంకు నుంచి కాల్ అంటూ.. 25 వేలు మాయం
సాయిలుకు సదరు మోసగాడు ఫోన్ చేసి కొత్త ఏటీఎంకు సంబంధించిన వివరాలు చెప్పడంతో ఆయన గుడ్డిగా నమ్మాడు. తర్వాత పాత ఏటీఎం వివరాలు చెప్పాలని అడగడంతో చెప్పేశాడు. డెబిట్ కార్డు వెనకాల ఉండే మూడంకెల సీవీవీ నెంబర్ కూడా కావాలనడంతో అది కూడా చెప్పేశాడు. దాంతో సాయిలు ఖాతాలో నుంచి వెంటవెంటనే మూడుసార్లు డబ్బులు డ్రా చేసినట్లు మేసేజ్లు వచ్చాయి. అలా 25 వేల రూపాయలు తన ఖాతాలోంచి లాగేశాడు సైబర్ నేరగాడు.
అతడి ఖాతా ఊడ్చి.. కుటుంబ సభ్యుల కార్డులపై కన్ను..!
తాను డ్రా చేయకున్నా.. డబ్బులు తీసుకున్నట్లు మేసేజ్లు రావడంతో కంగు తిన్నాడు సాయిలు. అదే క్రమంలో సదరు మోసగాడు మళ్లీ ఫోన్ చేశాడు. ఈసారి కుటుంబ సభ్యులకు చెందిన ఏటీఎం వివరాలు అడగడంతో ఏమీ చేయాలో తెలియక ఆ ఫోన్ కట్ చేసి అల్లుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అదంతా మోసమని ఆయన వివరించేసరికి ఆందోళనకు గురయ్యాడు సాయిలు.
పంట పెట్టుబడి కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇలా మోసగాళ్ల పాలుకావడం జీర్ణించుకోలేకపోతున్నాడు సాయిలు. తనకు జరిగిన మోసంపై కొల్చారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!
చోరీలకన్నా ఇదే బెటర్ అనుకుంటున్నారేమో..!
రోజుకు వంద మందికి ఫోన్ చేస్తే.. అందులో 90 మంది వ్యతిరేకించి.. కేవలం 10 మంది అమాయకులు దొరికినా చాలు. సైబర్ మోసగాళ్ల పంట పండినట్లే. ఆ పది మంది నుంచి తలా 10 వేల రూపాయలు మాయం చేసినా లక్ష రూపాయలు ఆ దొంగల చేతిలో పడ్డట్లే. ఏ పని చేస్తే రోజుకు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. అందుకే ఈ తరహా మోసాలను ఎంచుకుంటూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
చోరీలు చేయాలంటే రిస్క్తో కూడుకున్న పనిగా మోసగాళ్లు భావిస్తున్నట్లున్నారు. దొంగతనాలు చేయాలంటే రెక్కీలు నిర్వహించాలి. తెగించి రాత్రి పూట చోరీలు చేయాలి. ఒకవేళ జనాల చేతికి చిక్కితే కుళ్లబొడుస్తారు. ఆ తర్వాత పోలీసులకు చిక్కితే లాఠీ దెబ్బలు తప్పవు.. దోచిన సొత్తు అప్పజెప్పక తప్పదు. ఇదంతా రిస్క్ ఎందుకు అనుకుంటున్నారో ఏమో గానీ ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాల్లో నిందితులను పట్టుకోవడం అంతా సులభం కాదు. దాంతో తాము పోలీసులకు చిక్కలేమనే కారణంతో ఆర్థిక నేరాలకు తెర లేపుతున్నారు.