తప్పతాగి, కర్ర చేతబట్టి.. రెచ్చిపోయిన 'వాచ్మెన్'
సిద్ధిపేట : వాచ్మెన్ తప్పతాగి బెత్తం చేతబట్టాడు. సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులను చితకబాదాడు. వాచ్మెన్ గా కంటికి రెప్పలా కాపాడాల్సినోడు.. వాతలు తేలేలా కొట్టాడు. టీచర్ లా ఫోజిచ్చి ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఓ విద్యార్థి చేతికి తీవ్రగాయాలయ్యాయి. మరో విద్యార్థికి వీపు, తొడలు కమిలిపోయాయి. దౌల్తాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.
శనివారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దౌల్తాబాద్ మండల కేంద్రానికి సమీపంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఉంది. అందులో దౌల్తాబాద్ కు చెందిన పవన్, నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన విష్ణుతేజ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. శనివారం రాత్రి టాయిలెట్ కోసమని గదుల్లోంచి బయటకు వచ్చిన వీరిద్దరిని వాచ్మెన్ శంభులింగం బెదిరించాడు. బయటకు ఎందుకొచ్చారంటూ తిట్టడమే గాకుండా ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి వాతలు తేలేలా కొట్టాడు.
విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలియడంతో ఆదివారం నాడు పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పవన్ చేతికి తీవ్ర గాయం కావడంతో కట్టు వేశారు. విష్ణుతేజకు వీపు, తొడలపై వాతలు తేలాయి. వాచ్మెన్ శంభులింగంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపాల్, సిబ్బందిని లెక్కచేయకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించడమే గాకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపైన కూడా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.