8వ తరగతి గది.. ప్రేమ చిగురించిన చోటే ప్రేమికుల ఆత్మహత్య
సిద్దిపేట : ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమికులుగా మారారు. ఆరేళ్లుగా వారి ప్రేమ బంధం కొనసాగింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో మధ్యలో పంచాయితీ కూడా జరిగింది. నిజమైన వారి ప్రేమకు పెద్దలు నో చెప్పడంతో ప్రాణాలు తీసుకున్నారు. ఏ తరగతి గదిలో వారి మధ్య ప్రేమ చిగురించిందో.. అదే గదిలో ఆత్మహత్య చేసుకోవడం చర్చానీయాంశమైంది.
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. తమ కళ్ల ముందు పెరిగిన పిల్లలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
మనసులు కలిసి.. ప్రేమ చిగురించి
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన మంజ కనకయ్య (21సం.), రాచకొండ తార (19సం.) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఒకటే స్కూల్లో చదువుకోవడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 8వ తరగతిలో వారి మధ్య చిగురించిన ప్రేమ బంధం ఆరేళ్లుగా కొనసాగింది. మధ్యలో పెద్దలు ఒప్పుకోకపోవడం, అతడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లడం జరిగింది.
అదలావుంటే ఒకరికొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకోవడంతో కలిసి ఒక్కటదావుమనే వారి కోరిక నెరవేరలేదు. పెద్దల అభ్యంతరంతో ప్రేమను చంపుకోలేక చివరకు వారి ప్రాణాలు తీసుకున్నారు.
నమ్మకంతో నయవంచన.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. 12 గంటలు రాక్షసక్రీడ
పెద్దలు అంగీకరించలేదు..!
కులాలు వేరు కావడంతోనే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. ఇరువురి కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేమకు అడ్డు చెప్పారు. రెండు సంవత్సరాల కిందట అమ్మాయి తరపు వారు పంచాయితీ పెట్టించారు. దాంతో 30 వేల రూపాయల జరిమానా విధించారు గ్రామ పెద్దలు. ఆ ఘటన జరిగిన తర్వాత కనకయ్య ఊరు విడిచి వెళ్లాడు. హైదరాబాద్ వెళ్లి పెయింటర్గా పనిచేసి జీవనోపాధి చూసుకున్నాడు.
అదలావుంటే ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడు కనకయ్య. గతంలో పెద్దలు నిరాకరించినా.. పంచాయితీ పెట్టించి రాద్ధాంతం చేసినా.. వారి మధ్య ప్రేమ మాత్రం తరగలేదు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుని పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. అయితే కనకయ్య, తార కలుసుకుంటున్నారనే విషయం పెద్దలకు తెలియలేదు.
అదే తరగతి గదిలో సూసైడ్
సడెన్గా కనకయ్య, తార కనిపించకుండా పోవడంతో ఇరువురి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడకు వెళ్లారో తెలియక ఒక రోజంతా వెతికారు. కానీ జాడ దొరకలేదు. చివరకు మరుసటి రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసింది. కనకయ్య, తార బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. ఏ స్కూళ్లో చదువుకున్నారో.. అదే స్కూళ్లో వాళ్లు విగతజీవులుగా కనిపించడం కుటుంబ సభ్యులను కలచివేసింది.