విషాదం : మెదక్ యాసిడ్ దాడి బాధితురాలి మృతి... పరిస్థితి విషమించడంతో...
మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన బాధితురాలు మంగళవారం(మార్చి 9) తెల్లవారుజామున మృతి చెందింది. 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి మృతితో ఆమె స్వగ్రామం అంతాయిపల్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఆమెపై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
షాకింగ్ : మెదక్లో మహిళపై యాసిడ్ దాడి.. మహిళా దినోత్సవం రోజే దారుణం...
బాధితురాలు ఛత్రు భాయ్(42) టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండా వాసి. పదేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తోంది. స్థానికంగా కూలీ నాలీ చేసి బిడ్డలను పోషిస్తోంది. ఇదే క్రమంలో కొన్నేళ్ల క్రితం అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన సాజిద్ అనే పశువుల వ్యాపారికి ఆమె కొంత డబ్బును అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాజిద్ బాకీ తీర్చకపోవడంతో ఇరువురి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్లు సమాచారం.
ఇదే క్రమంలో బాకీ విషయమై మాట్లాడేందుకు ఆదివారం (మార్చి 7) సాయంత్రం ఆమె సాజిద్ వద్దకు వెళ్లింది. బాకీ విషయమై ఆమె అతన్ని ప్రశ్నించగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సాజిద్ పెట్రోల్ లాంటి మండే స్వభావం ఉన్న పదార్థాన్ని ఆమె ముఖం,ఒంటిపై పోసి నిప్పంటి వెళ్లిపోయాడు. మంటలకు ఛత్రు భాయ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో ఆమెను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.