ఏసీబీ కస్టడీలో నగేశ్ సహా నలుగురు: ఇతరుల పాత్రపై విచారణ..
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ సహా మరో నలుగురు అధికారులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రైతు భూమి ఎన్వోసీకి సంబంధించి కోటి 12 లక్షల లంచం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో భాగంగా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్, నగేశ్ బినామీ జీవన్ గౌడ్లను బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ వీరిని విచారించారు.
వారికి పీపీఈ కిట్లు అందజేసి... ప్రశ్నించారు. కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. కేసు విచారణలో భాగంగా ఈ నెల 24వ తేదీ వరకు నిందితులను కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో వివరాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.
గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్పిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే భూమికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ నగేశ్ను సంప్రదించాడు. అయితే ఇందుకు 1.12 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. రూ.40 లక్షల నగదు కూడా ఇచ్చాడు. అయితే మరో రూ.72 లక్షల కోసం ఐదెకరాల భూమిని తన బినామీ జీవన్ గౌడ్ పేరు మీద అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఆధారాలు సమర్పించడంతో వారు రంగంలోకి దిగి.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.