మాటల యుద్ధం.. గులాబీ దళంపై రఘునందన్ రావు ఫైర్, ఎమ్మెల్యేపై రేవంత్ మండిపాటు
రాష్ట్రంలో ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి బీజేపీకే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పేర్కొన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడేళ్లుగా ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తే 17 దేశాల్లో సంబరాలు చేసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలపై తాము పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పతనం సిద్దిపేట నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఇటు రఘునందన్రావుపై రేవంత్ రెడ్డి పైరయ్యారు. ఆయన కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేలేడని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ పగలు కొట్టుకుంటారు.. రాత్రి కలుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బంద్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈరోజు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. దానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కావాలంటే వాటిని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అడ్డుకునే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కి ఉందా అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.