మెజార్టీ పెరిగితే బాధ్యత పెరుగుతుంది.. భువనగిరిలో ఓడిపోవడానికి అదీ రీజన్ : హరీష్ రావు
సంగారెడ్డి : మెజార్టీతో గెలిచామంటే బాధ్యత మరింత పెరిగినట్లేనని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మెజార్టీ ఓట్లు వచ్చాయంటే.. మెజార్టీ ప్రజలు తమ నుంచి మరింత మంచి నాయకత్వం కోరినట్లేనని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన సభలో పాల్గొన్న హరీష్ రావు పలు అంశాలను ప్రస్తావించారు.
సన్మాన సభ అంటే కేవలం సదరు వ్యక్తిని గౌరవిస్తారు. వచ్చిన అతిథులు నాలుగు మాటలు మాట్లాడి పోతారు. కానీ ఈ సన్మాన సభ ఏర్పాటు చేసింది మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తను అభినందించడం కోసమేనని తెలిపారు హరీష్ రావు. కార్యకర్తల బాధ్యత తీరింది.. ఇక ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. ఇకపై కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదేనన్నారు.
లోక్సభ ఫలితాల్లో ఎదురుదెబ్బ.. థర్డ్ ఫ్రంట్ కలలు ఆవిరేనా..! కేటీఆర్ వాట్ నెక్స్ట్
కొత్తగా ఎంపీగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి వారంలో రెండు రోజులు సంగారెడ్డిలో ఉంటారని చెప్పుకొచ్చారు హరీష్ రావు. కార్యకర్తలకు, నేతలకు ఆయన అందుబాటులో ఉంటారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవెర్చుతామని ప్రకటించారు. ఆ క్రమంలో త్వరలోనే రైతులకు 5 వేల రూపాయల పంట బీమాతో పాటు నిరుద్యోగ భృతి, పెంచిన పింఛన్లు అమలు చేస్తామన్నారు.
భువనగిరిలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణముందన్నారు. అక్కడ టీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదన్నారు. కేవలం గుర్తు తెచ్చిన తంటాతోనే టీఆర్ఎస్ అభ్యర్థికి నష్టం వాటిల్లిందన్నారు. రోడ్ రోలర్ గుర్తు టీఆర్ఎస్ ఓట్లను చీల్చిందని చెప్పుకొచ్చారు.