తెలంగాణ డీజీపీకి తప్పని ఫైన్.. ఇంతకు చలానా ఎంతంటే..!
సంగారెడ్డి : కొత్త మోటార్ వాహనాల చట్టం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, మోటార్ వాహనాల చట్టాన్ని ధిక్కరిస్తే చలానాల మోత మోగుతోంది. చట్టం చుట్టం కాదంటూ ఎవరికి పడితే వారికి చలాన్లు రుద్దేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో తెలంగాణ డీజీపీకి ఫైన్ పడిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణ డీజీపీకి జరిమానా వేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ మేరకు ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అవుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే.. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో రూల్స్ బ్రేక్ చేశారనే కారణంతో సాక్షాత్తు డీజీపీ పేరుతో ఉన్న వాహనానికి చలానా వేశారు ట్రాఫిక్ పోలీసులు.
ఆనాటి అసెంబ్లీ టైగర్.. విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ..! కేసీఆర్కు చెక్ పెట్టడానికేనా?
TS 09 PA 5121 నెంబరుతో ఉన్న పోలీస్ వెహికిల్ సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ సమీపంలో రాంగ్ రూట్లో వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అది కాస్తా బాగా వైరల్ అయింది. అటు ఇటుగా ఆ ఫోటో చక్కర్లు కొట్టి చివరకు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో తప్పని పరిస్థితుల్లో ఈ నెల 3వ తేదీన జరిమానా వేశారు.
పోలీస్ శాఖకు చెందిన సదరు వాహనం డీజీపీ తెలంగాణ పేరుతో రిజిస్టర్ అయింది. దాంతో ఆ ఫోటో తాలూకు చలానా వేయడంతో డీజీపీకి జరిమానా వేసినట్లైంది. ఒక వెయ్యి నూట ముప్పై అయిదు రూపాయల చలానా వేశారు ట్రాఫిక్ పోలీసులు. అది https://echallan.tspolice.gov.in లో కూడా చూపిస్తోంది.